నటుడు, భాజపాఅసంతృప్తఎంపీ శత్రుఘ్న సిన్హా ఏప్రిల్ 6న కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్టు ప్రకటించారు. తన కుటుంబానికి సన్నిహితులైన లాలూ ప్రసాద్ యాదవ్ సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారాయన.
"భాజపా నుంచి వైదొలగడం బాధాకరం. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్షాలు నియంతల్లా వ్యవహరిస్తున్నారు. పార్టీ అభివృద్ధికి కృషిచేసిన ఆడ్వాణీ, మురళీ మనోహర్ జోషి లాంటి కురువృద్ధ మహానాయకుల్ని అవమానించారు. వారి తీరు భరించలేకే నేను భాజపాను వీడుతున్నాను."
- శత్రుఘ్న సిన్హా, నటుడు, భాజపా అసంతృప్త ఎంపీ
మహాత్మా గాంధీ, వల్లభాయి పటేల్, జవహర్లాల్ నెహ్రూ లాంటి గొప్ప నాయకులు కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహించారని శత్రుఘ్న గుర్తు చేశారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన కాంగ్రెస్ పార్టీలో చేరనుండడం ఆనందంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
"రాహుల్గాంధీ సమర్థుడైన నాయకుడు. రాజకీయ దార్శనికతతో ముందుకు సాగుతున్నారు. ప్రధాని అవ్వడానికి రాహుల్కి అన్ని అర్హతలు ఉన్నాయి."
- శత్రుఘ్న సిన్హా, నటుడు, భాజపా అసంతృప్త ఎంపీ
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వారివారి పార్టీల్లో చేరమని తనను కోరారని శత్రుఘ్న సిన్హా తెలిపారు.
" ఈ సార్వత్రిక ఎన్నికల్లో నేను పట్నా సాహెబ్ లోక్సభ స్థానం నుంచే పోటీ చేస్తా. 2014 లోక్సభ ఎన్నికల్లో భాజపా పార్టీ అండ లేకుండానే అత్యధిక మెజారిటీతో గెలిచాను. ఈసారి ఆ రికార్డును బద్దలుకొడతాను. ప్రచారానికి ఆడ్వాణీని గానీ, కూతురు సోనాక్షీ సిన్హాను గానీ పిలవను."
-శత్రుఘ్న సిన్హా, నటుడు, భాజపా అసంతృప్త ఎంపీ
పట్నా సాహెబ్లో భాజపా తరఫున పోటీలో నిలుస్తున్న కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తమ కుటుంబానికి సన్నిహితులని, ఆయనపై తనకు గౌరవం ఉందని శత్రుఘ్న వ్యాఖ్యానించారు.