వేర్వేరు కులాలకు చెందిన వారు ప్రేమించుకున్నారనే నెపంతో దురాగతానికి పాల్పడ్డారు ఒడిశా మయూర్బంజ్ జిల్లా మండ్వా గ్రామస్థులు. విచక్షణారహితంగా ప్రేమికులిద్దరికీ నడిరోడ్డులో శిరోముండనం చేశారు. అంతటితో ఆగకుండా ఈ దారుణాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మయూర్బంజ్ జిల్లా కరంజియాకు చెందిన అబ్బాయి... అదే జిల్లాలోని మండ్వా గ్రామానికి చెందిన అమ్మాయి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. శనివారం రాత్రి తన ప్రేయసిని కలిసేందుకు మండ్వాకు వెళ్లాడు ప్రేమికుడు. ఇద్దరు ఒక గదిలో కలిసి మాట్లాడుకుంటుండగా... గ్రామస్థుల కంటపడ్డారు. ఈ ప్రేమ జంటను చూసి తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన స్థానికులు వెంటనే మూకదాడి చేశారు. అనంతరం నడిరోడ్డులోనే శిరోముండనం చేశారు.
బాధితులిద్దరికీ పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన 21 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరిలో ముగ్గురిని అరెస్టు చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు.
ఇదీ చూడండి : ఇరాన్పై అమెరికా తాజా ఆంక్షలతో సర్వత్రా ఆందోళన