కాస్త సృజనాత్మక జోడిస్తే.. అద్భుతాలు సృష్టించవచ్చని మరోసారి నిరూపించాడు కర్ణాటక మంగళూరుకు చెందిన ముత్తప్ప. పర్యావరణాన్ని పీడిస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలను పద్ధతి ప్రకారం కూర్చి.. అందమైన ప్రహారీ గోడను నిర్మిస్తున్నాడు.
మంగళూరులోని కుక్కే సుబ్రమణ్య ఆలయానికి రోజూ వందలాది మంది భక్తులు వస్తుంటారు. వారంతా ప్లాస్టిక్ నీళ్ల సీసాలు కొనుగోలు చేసి.. ఖాళీ బాటిళ్లను ఎక్కడ పడితే అక్కడే పడేస్తారు. తెల్లారేసరికి అవి కుప్పలు తెప్పలుగా పేరుకుపోయేవి. పారిశుద్ధ్య విభాగం వారు చెత్తను తీసుకెళ్లి కాల్చేస్తారు. అందులో ఈ ప్లాస్టిక్ బాటిళ్ల కారణంగా వెలువడే విషపూరిత పొగ అంతా ఇంతా కాదు.
కాదేదీ గోడకు అనర్హం..
ఏళ్లు గడిచినా భూమిలో కరిగిపోని ఈ బాటిళ్లను నివారించడం ఎలా అని ఆలోచించాడు గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారి ముత్తప్ప. ప్లాస్టిక్తో ఎన్నో వస్తువులు తయారు చేస్తున్నాం.. ఓ గోడను కడితే ఎలా ఉంటుందని ఆలోచించాడు. సేకరించిన బాటిళ్లను కాల్చివేయకుండా, కుప్పలుగా వేయకుండా క్రమపద్ధతిలో పేర్చి ఎలా గోడను నిర్మించాలో ఇంటర్నెట్లో చూశాడు.
వేలకు వేలు పోసి ఇటుకలు కొనే బదులు.. ఇసుక, బురదను పనికిరాని నీళ్ల బాటిళ్లలో నింపి ఎంచక్కా దృఢమైన, మన్నికైన ప్రహారీ గోడను నిర్మించుకోవచ్చని పంచాయతీలో ప్రతిపాదించాడు. ముత్తప్ప పర్యావరణహిత ఆలోచనను ఉన్నత అధికారులు, గ్రామ ప్రజలు ఆమోదించారు.
ఇంకేముంది.. బాటిల్ వాల్ను చకచకా నిర్మించేస్తూ ఔరా అనిపిస్తున్నాడు. ఈ ప్రహారీ పూర్తయ్యాక చూసేందుకు వినూత్నంగానూ, ప్రయోజనకరంగానూ ఉంటుందని చెబుతున్నాడు ముత్తప్ప.