దేశంలో కరోనా అంతకంతకూ విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో అత్యధికంగా లక్ష కరోనా కేసులు నమోదయ్యాయి. వాటిలో సగానికిపైగా కేసులు ఒక్క ముంబయి నగరంలోనే నమోదు కావడం అక్కడి ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. జనసాంద్రత ఎక్కువగా ఉండే ముంబయిలో కరోనా వ్యాప్తిని చూస్తుంటే.. దేశ చరిత్రలో అతి బాధకరమైర ముంబయి ప్లేగు సంఘటన గుర్తుకు వస్తోంది. ప్రస్తుతం కరోనా వైరస్లాగే 19వ శతాబ్దం ఆఖర్లో ముంబయి నగరాన్ని ప్లేగు వ్యాధి అతలాకుతులం చేసింది. అయితే అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ప్లేగును నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుందో.. ప్రస్తుత మహారాష్ట్ర ప్రభుత్వం దాదాపు అలాంటి చర్యలే తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో అసలు ముంబయికి ఆ ప్లేగు వ్యాధి ఎలా వచ్చింది? అప్పటి ప్రభుత్వం ఏలాంటి చర్యలు తీసుకుంది? తదితర విషయలు తెలుసుకుందాం..
అప్పటి ముంబయి ఎలా ఉండేదంటే..
![how british govt eradicated the plague and the sililarities of corona virus and plague in telugu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7718414_212_7718414_1592807357144.png)
బ్రిటీష్వాళ్లు మన దేశాన్ని పాలిస్తున్న రోజుల్లో ముంబయిని దేశంలోనే తొలి మహానగరంగా తీర్చిదిద్దాలనుకున్నారు. మొదట్లో కేవలం సంపన్నులు మాత్రమే అధికంగా ఉన్న ముంబయికి నెమ్మదిగా పరిశ్రమలు తరలి వచ్చాయి. విదేశాలతో వాణిజ్య వ్యాపారాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో మిల్లుల్లో, పోర్టులో పనిచేసేందుకు దేశవ్యాప్తంగా అనేక మంది ముంబయికి వలస వచ్చారు. అలా ముంబయి మొత్తం దాదాపు కార్మికులతో నిండిపోయింది. 1891 జనాభా లెక్కల ప్రకారం అప్పుడు ముంబయిలో 8.20లక్షల మంది నివసించేవారట. అందులో 70శాతం మంది కార్మికులు మురికివాడల్లో చాల్స్ (అపార్ట్మెంట్లలో కుటుంబానికి ఒక చిన్న గది చొప్పున కేటాయించేవారు)లో ఉండేవారు.
ముంబయికి ప్లేగు ఎలా వచ్చింది?
![how british govt eradicated the plague and the sililarities of corona virus and plague in telugu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7718414_507_7718414_1592807366691.png)
1890లో చైనాలో ప్లేగు వ్యాధి బాగా విస్తరించింది. 1894 నాటికి హాంకాంగ్కు వ్యాపించింది. అదే సమయంలో ముంబయి..హాంకాంగ్ మధ్య వాణిజ్యపరమైన ట్రేడింగ్ నడుస్తోంది. ఈ క్రమంలో హాంకాంగ్ నుంచి ముంబయి వచ్చిన ఓడలో ప్లేగు వ్యాధికి వాహకంగా పనిచేసే ఎలుకలు కూడా వచ్చి నగరంలోకి ప్రవేశించాయి. అదే సమయంలో ముంబయిలో వానలు కురుస్తుండటం, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం.. హాంకాంగ్ నుంచి వచ్చిన ఎలుకలు సంతానోత్పత్తిని పెంచి నగరమంతా విస్తరించాయి. కార్మికులు ఉండే చిన్న చిన్న గదుల్లోకి చేరడంతో ప్లేగు వ్యాధి ప్రబలింది. తొలి ప్లేగు కేసు 1896లో ముంబయిలో మాండ్వి ప్రాంతంలో నమోదైంది. ఆ తర్వాత వ్యాధి వేగంగా వ్యాపించడం మొదలుపెట్టింది.
బ్రిటీష్ ప్రభుత్వం ఏం చేసింది?
![how british govt eradicated the plague and the sililarities of corona virus and plague in telugu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7718414_225_7718414_1592807388370.png)
ప్లేగు వ్యాప్తి తీవ్రత తెలుసుకున్న బ్రిటీష్ ప్రభుత్వం స్పందించింది. కార్మికులు నివసిస్తున్న మురికివాడల్లోనే ఎక్కువగా ప్లేగు వ్యాపిస్తుందని గుర్తించిన అధికారులు ఆయా ప్రాంతాలకు వెళ్లి ఇంటింటి సర్వే చేశారు. ప్లేగు నియంత్రణకు నిర్భందం.. వేరు చేయడం.. శుభ్రపర్చడం ఈ మూడు సూత్రాలను అవలంబించారు. వెంటనే మురికవాడలకు వెళ్లి ఎవరికైతే ప్లేగు వ్యాధి లక్షణాలు ఉన్నాయో వారిని ఆస్పత్రులకి, ప్లేగు శిబిరాలకు తరలించారు. వారి కుటుంబసభ్యులను.. రోగులు కలిసి వ్యక్తులను క్వారంటైన్ చేశారు. ప్లేగు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కార్మికులను ఇళ్లు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఖాళీ ఇళ్లను శుభ్రపర్చారు.
![how british govt eradicated the plague and the sililarities of corona virus and plague in telugu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7718414_941_7718414_1592807413043.png)
ఇప్పటి ప్రభుత్వం ఏం చేస్తోంది?
బ్రిటీష్ ప్రభుత్వంలాగే.. ప్రస్తుత మహారాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపు ఇవే చర్యలు చేపట్టింది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ధారవి ప్రాంతంలో అధికారులు ఇంటింటికి వెళ్లి కరోనా పరీక్షలు నిర్వహించారు. వైరస్ లక్షణాలు ఉన్నవారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. కరోనా సోకినట్లు నిర్ధరణ కాగానే ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మురికివాడల్లో క్రిమిసంహారక రసాయనాలతో ఎప్పటికప్పుడు పిచికారీ చేస్తున్నారు. కరోనా కేసులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ పరీక్షలు నిర్వహిస్తుండటంతో బాధితులను తొలిదశలోనే గుర్తించి ప్రాణాలు నిలపగలుతున్నారు. ఈ చర్యలతో ముంబయి నగరంలో కరోనా కేసుల కాస్త సంఖ్య తగ్గుతోంది.
బాంద్రాలాంటి సన్నివేశాలు అప్పట్లో కూడా
![how british govt eradicated the plague and the sililarities of corona virus and plague in telugu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7718414_197_7718414_1592807425909.png)
కరోనా నేపథ్యంలో ముంబయిలోని వలస కార్మికులంతా తమను స్వస్థలాలకు పంపాలంటూ బాంద్రా రైల్వే స్టేషన్ వద్ద ఆందోళనకు దిగిన సంఘటన గుర్తుందా..? అలాంటి సన్నివేశాలే అప్పట్లో ముంబయిలోనూ చోటుచేసుకున్నాయి. ప్లేగు వ్యాధి తీవ్రం కావడంతో వలస కార్మికులంతా తిరిగి వారి స్వగ్రామాలకు వెళ్లాలని భావించారు. దీంతో రైలు పట్టాల వెంట, రోడ్డు మార్గంలో కార్మికులంతా వెళ్లిపోయారు. అయితే వారితోపాటు ప్లేగు వ్యాధి కూడా దేశమంతా విస్తరించింది. ఆ తర్వాత కొన్నాళ్లకు డాక్టర్ వాల్దామర్ హఫ్కిన్ కనుగొన్న వ్యాక్సిన్తో ప్లేగు వ్యాధి తగ్గుముఖం పట్టడం మొదలుపెట్టింది. అయినా ప్లేగు పూర్తిగా అంతం కావడానికి 20ఏళ్లు పట్టింది.
![how british govt eradicated the plague and the sililarities of corona virus and plague in telugu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7718414_556_7718414_1592807334553.png)
ఇదీ చదవండి:కుదుటపడ్డ ధారావి.. తగ్గిన వైరస్ వ్యాప్తి