దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో దాడులకు తెగబడేందుకు జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. జమ్ముకశ్మీర్లో భద్రతా సిబ్బందిని అధిక సంఖ్యలో బలిగొనేందుకూ ఉగ్ర మూక ప్రణాళికలు రచిస్తున్నట్లు వెల్లడించాయి.
జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ-370ని కేంద్రప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో మనదేశంలో దాడులను ముమ్మరం చేయాలని జైషే మహమ్మద్ యోచిస్తోందని నిఘా వర్గాల సమాచారం. ముంబయిలో విధ్వంస రచన బాధ్యతను ముగ్గురు ఉగ్రవాదులతో కూడిన బృందానికి జైషే అప్పగించినట్లు పేర్కొన్నాయి. నగరంలో స్లీపర్ సెల్స్ ఇప్పటికే క్రియాశీలకంగా పనిచేస్తున్నట్లు నిఘా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
పీఓకేకు మసూద్ తమ్ముడు...
జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజార్ తమ్ముడు రవూఫ్ అస్ఘర్ పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోకి మంగళవారం ప్రవేశించాడు. అంతకుముందు అతడు రావల్పిండిలో పలు సమావేశాల్లో పాల్గొన్నాడు. పాక్లోని పంజాబ్ నుంచి జైషే ఉగ్రవాదులు అధిక సంఖ్యలో భారత సరిహద్దుల్లోకి చేరుకున్నారని చెప్పేందుకు రవూఫ్ రాక సంకేతంగా చెప్పొచ్చని నిఘావర్గాలు చెబుతున్నాయి.
పంజాబ్లో హై అలర్ట్...
అధికరణ-370 రద్దు నేపథ్యంలో జైషే మహమ్మద్, లష్కరేతోయిబా వంటి ఉగ్రవాద సంస్థలు పంజాబ్లో ఆత్మాహుతి దాడులకు తెగబడే ముప్పుందని నిఘా సమాచారం. దీంతో రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లోని జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది.
ఇదీ చూడండి: భారత్తో వాణిజ్య సంబంధాలు రద్దు! పాక్ నిర్ణయం