రాజ్యసభ ఎన్నికల వేళ..గుజరాత్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అక్షయ్ పటేల్, జీతు చౌదరీ తమ రాజీనామా లేఖలను గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేదికి సమర్పించగా వాటిని ఆమోదిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగినట్లైంది.
గుజరాత్లో 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా...వీటిలో రెండింటిని గెలుచుకోవాలని భావించిన కాంగ్రెస్కు ఇది ఎదురుదెబ్బగా మారింది.
మార్చిలోనూ...
మార్చిలోనే ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా 182 మంది సభ్యులున్న గుజరాత్ అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 68కి పడిపోయింది. తాజాగా మరో ఇద్దరు అదే బాటలో నడవటం వల్ల కాంగ్రెస్ బలం 66కు తగ్గింది. అధికార భారతీయ జనతా పార్టీకి గుజరాత్ అసెంబ్లీలో 103 మంది సభ్యులు ఉన్నారు. గుజరాత్లో నాలుగు రాజ్యసభ స్థానాలకుగాను భాజపా నుంచి ముగ్గురు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు పోటీపడుతున్నారు.
ఇదీ చూడండి:కరోనా నిర్ధరణ పరీక్షలకు ఇకపై ఆధార్ తప్పనిసరి