గతేడాది రాజస్థాన్లోని అల్వార్లో ఎస్సీ మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఐదుగురు నిందితులను దోషులుగా ప్రకటించి నలుగురికి జీవిత ఖైదు విధించింది. ఆ ఘటనను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచిన ఐదో వ్యక్తికి ఐదేళ్ల శిక్ష ఖరారు చేసింది. ఉత్తరప్రదేశ్లోని హాథ్రస్లో దళిత యువతిపై హత్యాచారంతో దేశంలో నిరసనలు వెల్లువెత్తున్న సమయంలో ఈ కేసులో ప్రత్యేక కోర్టు తీర్పు వచ్చింది.
అల్వార్లోని తనాగాజిలో గతేడాది ఏప్రిల్ 26న నలుగురు వ్యక్తులు సహా ఓ మైనర్.. భర్తను బంధించి అతడి ముందే మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. మరో వ్యక్తి ఆ సంఘటనను చిత్రీకరించాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేయడంలో పోలీసులు అలసత్వం, అత్యాచారానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చేవరకు స్పందించకపోవడంపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై మండిపడ్డాయి.
కేసు నమోదైన తర్వాత 16 రోజులకు మే 18న పోలీసులు నిందితులపై అభియోగపత్రం దాఖలు చేశారు. మంగళవారం న్యాయస్థానం దోషులైన చోటేలాల్ (22), హన్స్రాజ్ గుర్జన్ (20), అశోక్కుమార్ గుర్జన్ (20), ఇంద్రాజ్సింగ్ గుర్జన్ (22)కు జీవిత ఖైదు విధించింది. మరో వ్యక్తికి ఐదేళ్ల శిక్ష విధించింది. మైనర్ను జువైనల్ హోంకు తరలించాలని ఆదేశించింది.
ఇదీ చదవండి: కామాంధుడి కిరాతకానికి మరో హాథ్రస్ బాలిక బలి