భాజపా తనను పార్టీలోకి ఆహ్వానించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు జ్యోతిరాదిత్య సింధియా. పార్టీ కోసం, ప్రజల కోసం హృదయపూర్వకంగా పని చేస్తానని కార్యకర్తలకు మాట ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భాజపాలో చేరిన తర్వాత తొలిసారి మధ్యప్రదేశ్ భోపాల్లోని భాజపా కార్యాలయంలో ప్రసంగించారు సింధియా.
"ఈ రోజు నాకు భావోద్వేగమైన దినం. భాజపా కుటుంబం తలుపులు తెరవటం అనేది నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నా. మన అధ్యక్షులు నడ్డా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్టీ మాజీ అధ్యక్షులు, ప్రస్తుత హోంమంత్రి అమిత్ షాల ఆశీర్వాదంతో నాకు ఈ కుటుంబలోకి వచ్చేందుకు తలుపులు తెరుచుకున్నాయి."
- జ్యోతిరాదిత్య సింధియా, భాజపా నేత
గతంలో 20 ఏళ్ల పాటు కష్టపడి పని చేసిన పార్టీలో అన్నీ వదిలేసి ఇక్కడకు వచ్చానని తనను పూర్తిగా పార్టీ కోసం అంకితం చేస్తున్నట్లు తెలిపారు సింధియా.
కమల్నాథ్పై నిప్పులు..
ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్పై రాష్ట్ర మాజీ సీఎం, భాజపా అధ్యక్షుడు శివరాజ్ సింగ్ చౌహాన్ నిప్పులు చెరిగారు. కమల్నాథ్ చేసిన తప్పులను వెలకితీసేవరకు నిద్రపోయేది లేదని తేల్చిచెప్పారు.
" కమల్నాథ్ మీరు చేసిన పాపాలు, హింస, అన్యాయం, అవినీతి, బీభత్సాన్ని బయటపెట్టే వరకు మేము మౌనంగా కూర్చోమని ఈ రోజు ప్రతిజ్ఞ చేస్తున్నాము."
- శివరాజ్ సింగ్ చౌహాన్, భాజపా నేత.
సింధియాకు ఘనస్వాగతం..
భాజపాలో చేరిన తర్వాత తొలిసారి భాజపా కార్యాలయానికి సింధియా వచ్చిన సందర్భంగా పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు ఘనస్వాగతం పలికారు. ముందుగా భోపాల్ విమానాశ్రయానికి చేరుకున్న భాజపా కార్యకర్తలు, నేతలు.. కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ థోమర్తో పాటు సింధియాకు స్వాగతం పలికారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భాజపా కార్యకర్తలు కాషాయ జెండాలు చేతబూని సింధియాకు మద్దతుగా నినాదాలు చేశారు. భాజపా ఎమ్మెల్యే యశోధర రాజే సింధియా కూడా విమానాశ్రయానికి వచ్చారు.