లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భాజపా నేత, కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద్ను సిట్ పోలీసులు అరెస్టు చేశారు. న్యాయ విద్యార్థినిపై లైంగిక వేధింపుల కేసులో చిన్మయానంద్ను... ఉత్తర్ప్రదేశ్లోని షాజాన్పూర్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం భారీ భద్రత మధ్య ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. చిన్మయానంద్కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది స్థానిక కోర్టు.
ఫేస్బుక్లో ఆరోపణలు..తర్వాత కేసు
న్యాయ విద్యార్థిపై అత్యాచారానికి పాల్పడినట్లు చిన్మయానంద్పై గత కొంతకాలంగా ఆరోపణలు వస్తున్నాయి. ఆయనకు యూపీలో పలు ఆశ్రమాలు, విద్యాసంస్థలు ఉన్నాయి. చిన్మయానంద్కు చెందిన ఓ కళాశాలలో చదువుతున్న న్యాయ విద్యార్థిని ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. బ్లాక్మెయిల్ చేసి తనపై ఆయన పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ గత నెల 24న ఫేస్బుక్లో ఓ వీడియో పోస్టు చేశారు. అందుకు సంబంధించిన వివరాలను విచారణ సమయంలో పోలీసులకు తెలిపారు.
ఈ కేసు వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లగా.. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటుచేయాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన సిట్ బృందం చిన్మయానంద్ను పలుమార్లు విచారించింది. అయితే అప్పటికీ ఆయనపై కేసు నమోదు చేయలేదని పోలీసుల తీరుపై బాధితురాలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాను చనిపోతేగానీ ఆయనపై కేసు పెట్టరేమోనని ఆవేదన చెందారు. ఈ క్రమంలో నేడు చిన్మయానంద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి: కశ్మీర్పై తీర్మానం ఫైల్ చేయలేకపోయిన పాక్