"2012లో భారత్లో ఊబకాయంతో బాధపడుతున్న పెద్దలు 25.2 మిలియన్లు. 2016 నాటికి ఆ సంఖ్య 34.3 మిలియన్లకు పెరిగింది. 2019 నాటికి స్థూలకాయంతో ఇబ్బందులు పడుతున్నవారు ఏకంగా 135 మిలియన్లకు చేరుకున్నారు. "
భారత్లో స్థూలకాయం తీవ్రతపై ఐక్యరాజ్య సమితి చెప్పిన గణాంకాలు ఇవీ.
"అధిక బరువు ఉన్న వారికి కరోనా కారణంగా ప్రాణాపాయం ఎక్కువగా ఉంటుంది. వారికి ఐసీయూ తప్పనిసరిగా అవసరం అవుతుంది"
పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ (పీహెచ్ఈ) తాజా నివేదికలోని సారాంశం ఇదీ..
పీహెచ్ఈ నివేదికకు స్పందించిన బిటన్ ప్రభుత్వం.. దేశ ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించింది. వ్యాయామంతో కూడిన ప్రయాణాలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కరోనా బారిన పడి కోలుకున్న ప్రధాని బోరిస్ జాన్సన్.. సైక్లింగ్ దానికి చక్కటి మార్గమని భావించారు.
అందులో భాగంగా దేశవ్యాప్తంగా వేలాది మైళ్ల సైకిల్ మార్గాలను నిర్మించడానికి పూనుకున్నారు. హైవేల్లో సైక్లిస్టులు, పాదచారుల రక్షణ కోసం 2 బిలియన్ పౌండ్లను కేటాయించారు బోరిస్.
అలాగే అక్కడి వైద్యులూ ఆస్పత్రులకు వచ్చే రోగులను సైక్లింగ్ వైపు ప్రోత్సహిస్తుండటం గమనార్హం. అయితే ఊబకాయం సమస్య తీవ్రంగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటి కాగా.. ఇండియాలోనూ యూకే తరహాలో సైక్లింగ్ను ప్రోత్సహించే కార్యక్రమాలకు శ్రీకారం చూట్టాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. భారత ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
" ఊబకాయులు కరోనా వైరస్ బారిన పడిన తర్వాత పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. ఈ నేపథ్యంలో సురక్షితమైన వ్యాయామ మార్గాల అవసరం ఉంటుంది. ఈ క్రమంలో స్థూలకాయానికి చెక్ పెట్టడానికి యూకే ప్రభుత్వం సైక్లింగ్ను ప్రోత్సహించాలనుకోవడం మంచి ఆలోచన. భారత్లో కూడా అలాంటి నిర్ణయాలు అవసరం. ప్రధానంగా ముఖ్య పట్టణాల్లో బైక్లను పక్కన పెట్టి.. సైక్లింగ్కు అలవాటు పడేలా యంత్రాంగం చొరవ చూపాలి. "
-నవీన్ సతీజా, సీనియర్ కన్సల్టెంట్-లాప్రోస్కోపిక్ సర్జరీ, గురుగ్రామ్
నవీన్ సతీజాతో పాటు అనేకమంది ఆరోగ్య నిపుణులు అధిక బరువు సమస్యకు సైక్లింగ్ చక్కటి పరిష్కార మార్గమని అభిప్రాయపడుతున్నారు.
కరోనా కారణంగా అందరూ ఇళ్లకే పరిమితం కావడం, జిమ్లు తెరుచుకోకపోవడం, సామూహిక వ్యాయామాలకు దూరంగా ఉండటం వల్ల దేశంలో ఊబకాయుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు గురుగ్రామ్కు చెందిన కొలంబియా ఆసియా ఆసుపత్రిలో సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అమితాభా ఘోష్.
" ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాయామంతో కూడిన రవాణా వ్యవస్థను ప్రోత్సహించడం చాలా అవసరం. ప్రధానంగా శారీరక శ్రమ తక్కువగా ఉన్న పట్టణ ప్రాంతాల్లో సైకిల్ మార్గాలను ఏర్పాటు చేసి.. ప్రజలను ఆ దిశగా ప్రోత్సహించాలి. సైక్లింగ్ అనేది కరోనా నుంచే కాకుండా భవిష్యత్తులో ఉత్పన్నమయ్యే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది."
-డాక్టర్ అమితాభా ఘోష్, కొలంబియా ఆసియా ఆసుపత్రిలో ఇంటర్నేషనల్ మెడిసిన్ సీనియర్ కన్సల్టెంట్
దేశంలో ప్రత్యామ్నాయ రవాణా మార్గంగా సైక్లింగ్ను ప్రోత్సహించడానికి బలమైన ఆరోగ్య విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు ప్రముఖ సైకిల్ తయారీ కంపెనీ హీరో మోటార్స్ ఛైర్మన్, ఎండీ పంకజ్ ముంజల్.
" సైక్లింగ్ విషయంలో యూకే ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. బ్రిటన్ను అనుసరించేందుకు చాలా దేశాలు సిద్ధమవుతున్నాయి. సైక్లింగ్ విషయంలో యూకేను భారత్ ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది."
-పంకజ్ ముంజల్, హీరో మోటార్స్ ఛైర్మన్
సైక్లింగ్ వల్ల అదనపు ప్రయోజనాలు..
పలు అధ్యయనాలు సైక్లింగ్ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాయి.
- సైకిల్ తొక్కడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
- ఎముకలు బలపడతాయి.
- బరువు తగ్గుతారు.
- ఒత్తిడిని జయిస్తారు.
- ఫిట్గా ఉంటారు.
- వాయు కాలుష్యం తగ్గుతుంది.
- ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ (టెరి) అధ్యయనం ప్రకారం.. ప్రజలు సైక్లింగ్ చేయడం వల్ల భారతదేశంలో ఏటా రూ.1.8 ట్రిలియన్ల ఇంధన వ్యయం ఆదా అవుతుంది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వల్ల సైకిల్కు పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందని హెచ్ఎంసీ గ్రూప్ తెలిపింది. సైకిల్ ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వివరించింది.
ఇదీ చూడండి:కరోనా ఎఫెక్ట్: 'సైకిల్'కు ఇక స్వర్ణ యుగమే!