దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన 70 మంది ఎమ్మెల్యేల్లో 50 శాతం మందికి పైగా క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. ఏడీఆర్ నివేదిక ప్రకారం 70 మంది ఎమ్మెల్యేల్లో 43 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వారిలో 37 మంది ఎమ్మెల్యేలపై హత్యాయత్నం, అత్యాచారం వంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి.
13మందిపై అభియోగాలు..
37 మందిలో 13 మంది మహిళలపై నేరాలకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. వీరిలో ఒకరిపై అత్యాచారం కేసు కూడా నమోదైంది. గత శాసనసభలో 24 మంది ఎమ్మెల్యేలపై మాత్రమే క్రిమినల్ కేసులు ఉన్నాయి.
కోటి రూపాయల పైమాటే!
45 మంది ఆమ్ఆద్మీ ఎమ్మెల్యేలు, ఏడుగురు భాజపా ఎమ్మెల్యేలకు కోటి రూపాయలకు పైగా ఆస్తులున్నట్లు ఏడీఆర్ అధ్యయనంలో వెల్లడైంది. ప్రస్తుత దిల్లీ అసెంబ్లీలో 62 మంది ఆప్ ఎమ్మెల్యేల సగటు ఆస్తుల విలువ 14 కోట్ల 96 లక్షలుకాగా భాజపా ఎమ్మెల్యేల సగటు ఆస్తుల విలువ 9 కోట్ల 10 లక్షలు కావడం గమనార్హం.
ఇదీ చూడండి: రైల్వే బాదుడు-స్టేషన్లలో వినియోగ ఛార్జీలు!