ప్రాణాంతక కరోనా విజృంభణ నేపథ్యంలో జైళ్లలో ఉన్న ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయించింది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. సుప్రీం కోర్టు ఆదేశాలు మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఖైదీల విడుదలకు జస్టిస్ పంకజ్ కుమార్ జైస్వాల్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
'రాష్ట్రంలోని 71 జైళ్లలో కనీసం ఏడేళ్లు శిక్షా కాలం అనుభవించిన నేరస్థులకు వ్యక్తిగత పూచీకత్తుపై 8 వారాల మధ్యంతర బెయిల్ ఇవ్వాలి. ఏడు లేదా అంతకన్నా తక్కువ కాలం శిక్ష అనుభవించిన ఖైదీలకు వ్యక్తిగత పూచీకత్తుపై 8 వారాల పెరోల్ ఇవ్వాలి. తక్షణమే వారిని జైలు నుంచి బయటకు పంపించాలి' అని కమిటీ సూచించిందని వివరించారు అధికారులు.
11 వేల మంది ఖైదీలు
మొత్తం 11 వేల మంది ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయించింది యూపీ ప్రభుత్వం. వీరిలో 8,500 మంది విచారణ ఖైదీలు. మిగిలిన వారు శిక్షపడిన ఖైదీలు.
గరిష్ఠంగా ఏడేళ్లు శిక్ష అనుభవించిన వారితోపాటు మిగిలిన ఖైదీలను పెరోల్ లేదా మధ్యంతర బెయిల్పై విడుదల చేయాలని అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది సుప్రీం కోర్టు.
ఇదీ చూడండి: సామాజిక దూరంపై తిరుగుబాటు- గాల్లోకి కాల్పులు