భవన నిర్మాణ కార్మికులకు కేంద్రం వేతన మద్దతు ప్రకటించాలన్నారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆమె లేఖ రాశారు.

భారత్లో దాదాపు 500 కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో.. వైరస్ వ్యాప్తి మరింత విస్తరించకుండా 548 జిల్లాల్లో లాక్డౌన్ అమలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ లాక్డౌన్ కారణంగా నాలుగున్నర కోట్ల మంది కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు జీవనాధారం కోల్పోయారని సోనియా గాంధీ తెలిపారు. అలాంటి వారిని ఆదుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రధానిని కోరారు.
"కరోనా కట్టడికి కేంద్రం తీసుకున్న లాక్డౌన్ చర్యలు.. అనధికారిక రంగాలపై ప్రభావం చూపుతున్నాయి. ఆర్థిక అంతరాలకు దారి తీస్తున్నాయి. నగరాల్లో ఎంతోమంది ఉపాధి కోల్పోయారు. ఈ అసాధారణ పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని, అత్యవసర చర్యలను చేపట్టాలని కోరుతున్నాను. రాష్ట్ర భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులకు వేతన మద్దతు ప్రకటించాలి. "
- సోనియా గాంధీ, కాంగ్రెస్ అధినేత్రి
కెనడా వంటి ఎన్నో దేశాలు కూలీలకు సబ్సిడీని ప్రకటించాయని, భారత్ కూడా అదే మార్గంలో నడిచి కార్మికులను ఆదుకోవాలని కోరారు సోనియా.
ఉపాధి నియంత్రణ సేవా నిబంధనల చట్టం-1996 కార్మికులకు వివిధ సంక్షేమ పథకాలను అందిస్తోందని.. ఈ చట్టం ఆధారంగా రాష్ట్ర సంక్షేమ బోర్డులు, సంక్షేమ నిధులు ఏర్పాటు చేయొచ్చని పేర్కొన్నారు కాంగ్రెస్ అధ్యక్షురాలు.