మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్నకొద్దీ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ప్రధాన సమస్యలైన పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంకు కుంభకోణం, ఆరే కాలనీ వృక్షాల తొలగింపును ఎన్నికల అస్త్రాలుగా చేసుకోవాలని చూస్తోంది కాంగ్రెస్. ప్రచారాల్లో ప్రధానంగా వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లి లబ్ధి పొందాలనుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ ముంబయి నగర అధ్యక్షుడు ఏక్నాథ్ గైక్వాడ్ వ్యాఖ్యలతో ఈ విషయం స్పష్టమవుతోంది.
పలు కీలక సమస్యలతో ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు గైక్వాడ్.
" గుంతల రోడ్లు, పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకు కుంభకోణం, మెట్రో కార్ షెడ్ కోసం ఆరే కాలనీలో వృక్షాల తొలగింపు వంటి సమస్యలపై ముంబయి ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు."
- ఏక్నాథ్ గైక్వాడ్, కాంగ్రెస్ పార్టీ ముంబయి నగర అధ్యక్షుడు.
బుజ్జగింపులు..
టికెట్ల కేటాయింపుపై అసంతృప్తి వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకుడు సంజయ్ నిరుపమ్తో సహా పార్టీపై గుర్రుగా ఉన్న నాయకులను బుజ్జగించే పనిలోపడింది ఆ పార్టీ నాయకత్వం. పార్టీపై నెలకొన్న అపార్థాలను తొలగించుకునేందుకు నిరుపమ్ ఏఐసీసీ ప్రధానకార్యదర్శి మల్లికార్జున ఖర్గే, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలవాలని సూచించారు గైక్వాడ్.
తమ విధేయులకు టికెట్ రాకుండా రాహుల్ గాంధీకి సన్నిహితంగా ఉన్న నాయకులు కుట్ర పన్నారని నిరుపమ్ ఆరోపించిన మరుసటి రోజునే ఈ వ్యాఖ్యలు చేశారు గైక్వాడ్. పార్టీ మాజీ నాయకురాలు ఊర్మిళ మతోండ్కర్, నిరుపమ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారనే నమ్మకం ఉందని తెలిపారు.
అక్టోబర్ 21న ఎన్నికలు..
288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకే విడతలో ఈనెల 21న ఎన్నికలు జరగనున్నాయి. 24న ఫలితాల విడుదలవుతాయి.
ఇదీ చూడండి: మహా పోరు: కాంగ్రెస్ ప్రచారంలో సోనియా, మన్మోహన్