'కంపెనీల చట్ట సవరణ బిల్లు'ను లోక్సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీనిపై హర్షం వ్యక్తం చేశారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ఈ బిల్లుతో కేంద్రప్రభుత్వం 4 లక్షల డొల్ల కంపెనీలను డీ-రిజిస్టర్ (జాబితా నుంచి తొలగించడం) చేసిందని తెలిపారు.
'కంపెనీల చట్ట సవరణ బిల్లు' ద్వారా కార్పొరేట్ సామాజిక బాధ్యత నిబంధనలు కఠినతరం చేయడానికి, కంపెనీ చట్ట నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే ఈ బిల్లు ద్వారా, సులభతర వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి, చిన్న కంపెనీలపై భారాన్ని తగ్గించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
కార్పొరేట్ సామాజిక బాధ్యత
'కంపెనీ చట్ట సవరణ బిల్లు-2019 ప్రకారం, కంపెనీలు తమ లాభాల్లో 2 శాతం 'కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)' కింద ఖర్చు చేయాలి. నాలుగేళ్లలో ఈ నిధులు ఖర్చు చేయకుంటే వాటిని ప్రత్యేక ఖాతాలో జమచేయాలి. కానీ సంస్థలు ఆ పనిచేయడం లేదని' కేంద్రమంత్రి సీతారామన్ తెలిపారు.
కంపెనీ చట్టం ప్రకారం, రూ.5 కోట్లకు పైగా లాభాలు పొందుతున్న కంపెనీలు, రూ.100 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలు, లేదా రూ.500 కోట్లు నికరవిలువ ఉన్న సంస్థలు 'కార్పొరేట్ సామాజిక బాధ్యత' నిర్వహించాలి. అంటే తమ కంపెనీ మూడేళ్ల సగటు లాభాల్లో 2 శాతం సీఎస్ఆర్ కింద ఖర్చు చేయాలి.
వ్యాపార సంస్థ నిలదొక్కుకోవడానికి ఓ ఏడాది పోగా, మరో మూడేళ్లలో ఈ నిధులను కంపెనీలు ఖర్చుచేయాల్సి ఉంటుంది. ఈ నాలుగేళ్లలో నిధులను ఖర్చు చేయకపోతే.. వాటిని ప్రత్యేక ఖాతాలో జమచేయాలి. అవి ప్రధానమంత్రి సహాయనిధికి చేరతాయి
డొల్ల కంపెనీలు అనే పదం లేదు
డొల్ల కంపెనీలపై సభ్యుల ఆందోళనలకు ఆర్థిక మంత్రి స్పందిస్తూ, నిబంధనల పుస్తకంలో డొల్లకంపెనీలు అనే పదం లేదన్నారు.
సీఎస్ఆర్ చట్టబద్ధం
కంపెనీల సవరణ చట్టం తేవడం ద్వారా కార్పొరేట్ సామాజిక బాధ్యతను తప్పనిసరిన చేసిన మొదటి దేశంగా భారత్ నిలిచిందని నిర్మలా సీతారామన్ హర్షం వ్యక్తం చేశారు.
నిబంధనలు పాటించని డొల్ల కంపెనీలను... తొలగించడానికి 'రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్' (ఆర్ఓసీ)కు కంపెనీల చట్ట సవరణ బిల్లు అధికారమిస్తుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.