భారత్-చైనా సరిహద్దులో ఇప్పుడప్పుడే శాంతి నెలకొనే పరిస్థితులు కనిపించటం లేదు. భారీగా బలగాల మోహరింపులతో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మరోవైపు సైన్యానికి కఠిన సవాళ్లు విసురుతూ శీతాకాలం ముంచుకొస్తోంది. ఈ పరిస్థితుల్లో మానసికంగా పైచేయి సాధించేందుకు చైనా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే సరిహద్దులో తమ సైనిక సామర్థ్యం ప్రదర్శిస్తూ.. యుద్ధ సన్నద్ధత చాటుతోంది. ప్రఖ్యాత చైనా వ్యూహకర్త సన్ జూ సిద్ధాంతాలకు అనుగుణంగా వ్యవహరిస్తూ... భారత సేనల స్ఫూర్తి దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోంది.
శీతాకాలం సవాళ్లు
ఏప్రిల్-మేలలో మొదలైన పదాతి దళం ఘర్షణలు కొలిక్కి రాలేదు. ఓవైపు సైనిక చర్చలు జరుగుతున్నా ఆశించిన ఫలితాలు రావట్లేదు. ఈ నేపథ్యంలోనే శీతాకాలంలోనూ సైన్యం వెనక్కి తగ్గే సూచనలు లేనట్లే కనిపిస్తోంది. మరోవైపు అక్కడ మౌలిక సదుపాయాల కల్పన, రవాణా.. ఇరు దేశాలకు సవాళ్లు విసురుతోంది.
చైనా గుడారాలు..
ప్రస్తుతం హిమగిరుల్లో గతంలో ఎన్నడూ చూడని పరిస్థితులు నెలకొన్నాయి. సైనికులకు డ్రోన్ల ద్వారా వేడి ఆహారం అందిస్తున్న తీరు, చాలా ఎత్తైన స్థానాల్లో సైన్యాన్ని మోహరించిన పరిస్థితులు, భారీ సంఖ్యలో ఒక్కచోటుకు చేరిన అత్యాధునిక ఆయుధాలు, వాతావరణానికి తగినట్లుగా మారుతున్న సైనికుల దుస్తులు వంటివి ఇందులో ప్రధానం. ఇలాంటి దశలో.. చైనా సైన్యం సరికొత్త రెడీమేడ్ థర్మల్ గుడారాలను నియంత్రణ రేఖ వెంట భారీగా ఏర్పాటు చేసింది. చైనా ప్రభుత్వం కనుసన్నల్లో నడిచే 'గ్లోబల్ టైమ్స్' ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రచురించింది. వాతావరణాన్ని ఎదుర్కొనేందుకు పీఎల్ఏ పడుతున్న పాట్లను తెలియజేసింది.
పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా వీటిని ఏర్పాటు చేసుకునే వీలుంటుంది. వసతి సదుపాయలతో సహా.. గిడ్డంగులు, భోజనశాలలు, మూత్రశాలలతో పాటు.. ఇతర పరికాలన్నీ మైనస్ -55 సెల్సియస్ ఉష్ణోగ్రతల వద్ద, 5,500 అడుగుల ఎత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పని చేస్తాయి.
-గ్లోబల్ టైమ్స్
ఈ తరహా ఏర్పాట్లతో చైనా తన బలహీనలను బయటపెట్టుకుంటోంది. ఇలాంటి పరిస్థితులు, వాతావరణంలో గతంలో పోరాడిన అనుభవం లేదని చాటుకుంటోంది. యుద్ధ క్షేత్రంలో సౌకర్యాల కోసం పాకులాడుతోంది.
భారత్ సత్తా
మరోవైపు, భారత సైన్యం తమ సామర్థ్యం చాటుకుంటోంది. భారత్-చైనా సరిహద్దులో విధులు నిర్వర్తిస్తున్న సైనికులు.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రణక్షేత్రంగా పేరొందిన సియాచిన్లో దేశం కోసం కాపు కాసినవారు. ఇక్కడ పరిస్థితులు తూర్పు లద్ధాఖ్ కంటే దారుణంగా ఉంటాయి. ఇలాంటి ప్రాంతంలో గత కొన్నేళ్లలో మౌలిక సదుపాయల కల్పనను ముమ్మరం చేసిన భారత్.. గణనీయమైన పురోగతి సాధించింది.
కొనసాగుతున్న చర్చలు
అయితే, సోమవారం ఏడవసారి ఇరు దేశాల మధ్య కమాండర్ స్థాయి చర్చలు జరుగుతున్న నేఫథ్యంలో.. చైనా మోహరింపులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
రెండు దేశాలు.. సరిద్దుల వెంట, కఠినమైన ప్రదేశాల వద్ద బలగాలు, భారీ యుద్ధ పరికరాల మోహరింపు తగ్గించాలనే అంగీకారానికి వచ్చాయి. అయితే, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అలా కనిపించటం లేదు.
చైనా కొత్త పాట
1959లో నాటి చైనా ప్రధాని చౌ-ఎన్ లై.. భారత ప్రధాని నెహ్రూతో తమ ప్రాంతాలకు ప్రతిపాదించిన కొన్ని ప్రాంతాలను తిరిగి ఇచ్చేయాలని తాజా చైనా అసంబద్ధ డిమాండ్ను తెర మీదకు తెచ్చింది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి.
-సంజీవ్ బారువా