ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాపై పోరులో.. ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతోంది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్రాలు, జిల్లాల అధికార యంత్రాంగానికి మార్గదర్శకాలు జారీ చేసినట్లు హోంశాఖ తెలిపింది. ఈ విధానం ద్వారా వైరస్ నియంత్రణ కోసం పలు వర్గీకరణలు చేపట్టింది. వాటిని కార్యాచరణ ప్రాంతం, నియంత్రణ పరిధి, కంటెయిన్మెంటు ప్రాంతం, బఫర్ జోన్గా పిలవనున్నారు.
మరింత పకడ్బందీగా కంటెయిన్మెంటు ప్రాంతాలను జల్లెడ పట్టాలని, రెడ్జోన్గా గుర్తించిన ప్రాంతాల్లో ఒక్కరిని కూడా బయటకు రాకుండా నియంత్రించనుంది.
వ్యూహమిదే..
వ్యాధి సోకిన వారి కోసం గాలింపు, కాంటాక్ట్ ట్రేసింగ్, నిర్బంధ కేంద్రాలు, వైద్య సదుపాయాల నిర్వహణ, ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు చేపడుతున్నట్లు స్పష్టం చేసింది. వైరస్ నియంత్రణ దిశగా చర్యలు తీసుకోవాల్సిన ప్రాంతం, నియంత్రణ పరిధి, బాధితుల కోసం గాలింపు, త్వరితగతిన నిర్బంధానికి తరలింపు, సన్నిహితంగా మెలిగినవారి జాబితా తయారీ, వారిని గుర్తించడం.. నిర్బంధంలో ఉంచడం, వారితో కలిసిన వారిని గుర్తించడం వంటివి చేపట్టాలని నిర్ణయించింది.
అనుమానితులు, బాధితులతో సన్నిహితంగా మెలిగి వ్యాధి లక్షణాలు ఉన్నవారు, వ్యాధి లక్షణాలు లేనప్పటికీ బాధితులను కలిసిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. తీవ్ర శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారికీ కొవిడ్-19 నిర్ధరణ పరీక్షలు చేయాలని సంకల్పించింది.
80 శాతం కేసులు అక్కడే..
రెడ్ జోన్ పరిధిలో ఉన్న జిల్లాలు, నగరాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది ప్రభుత్వం. భారత్లోని 80 శాతం కేసులు ఇక్కడే నమోదవుతున్నట్లు తెలిపింది. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో.. స్థానికంగానే వైరస్ సంక్రమించే అవకాశాలు పెరిగినట్లు స్పష్టం చేసింది.
15 కేసులు మించితే..
ఒక ప్రాంతంలో 15 మందికి మించి వైరస్ సోకినట్లయితే దానిని చిన్న వైరస్ ప్రభావిత ప్రాంతంగా, బహుళ ప్రభావిత ప్రాంతాలుగా గుర్తిస్తున్నట్లు పేర్కొంది హోంశాఖ. కేసుల సంఖ్య 15 కంటే తక్కువగా ఉంటే సాంక్రమణ వ్యాప్తిగా నిర్ధరిస్తున్నట్లు తెలిపారు.
రాకపోకలు నిషిద్ధం..
కంటెయిన్మెంటు ప్రాంతంలోకి రాకపోకలను నిషేధిస్తున్నట్లు వెల్లడించింది హోంశాఖ. ఆయా ప్రాంతాలకు సరిహద్దులను నిర్ణయించి ఆంక్షలు విధిస్తామని స్పష్టం చేసింది. అత్యవసర సేవల కోసం వెళ్లే వాహనాలను ఎంపిక చేసిన రెండు రహదారుల్లో మాత్రమే అక్కడికి అనుమతించనున్నట్లు తెలిపింది. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లోకి వెళ్లే అన్ని మార్గాలను పోలీసులు, వాలంటీర్లు పర్యవేక్షించనున్నారని చెప్పింది.
అత్యవసర సేవలు మినహా కరోనా ప్రభావిత ప్రాంతం నుంచి బయటకు రావాలనుకునే వారిని అనుమతించబోమని స్పష్టం చేసింది. కంటెయిన్మెంటు జోన్లోకి వెళ్లాలని అనుకునేవారిని తప్పనిసరి సందర్భంలోనే అనుమతిస్తామని చెప్పింది. అన్ని వాహనాలు, ప్రజా రవాణా, వ్యక్తిగత వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించనున్నారు. నియంత్రణ పరిధి దాటి ప్రయాణించే వారిపై పర్యవేక్షణ ఏర్పాటు చేసి వైద్య అధికారులకు నివేదించనున్నారు.
ఇంటింటికి కార్యకర్తలు..
నాలుగు రోజుల లోపు వైరస్ కేసులు రెట్టింపు అయిన జిల్లాలను (ప్రతి సోమవారం 7 రోజుల గణాంకాలు తీస్తున్నారు.) రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా గుర్తించి చర్యలు చేపడతామని స్పష్టం చేసింది హోంశాఖ. కంటెయిన్మెంటు, బఫర్జోన్లలో.. అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఎన్ఎస్ఎస్, నెహ్రూ యువకేంద్రాలు ఇంటింటి సర్వే ద్వారా పర్యవేక్షణ పెంచడం.. వైరస్ నిర్ధరణ పరీక్షలను ముమ్మరం చేసే లక్ష్యంతో పనిచేయనున్నట్లు తెలిపారు.
207 జిల్లాలు కరోనా హాట్స్పాట్లు
ఇప్పటివరకు 207 జిల్లాలను వైరస్ హాట్స్పాట్లుగా గుర్తించినట్లు వెల్లడించింది హోంశాఖ. వైరస్ పెరిగే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఈ జిల్లాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. దేశంలో ఉన్న మొత్తం 730 జిల్లాల్లో.. 353 జిల్లాలపై వైరస్ ప్రభావం లేదని.. అయితే కరోనా లక్షణాలు ఎవరికి ఉన్నా వారికి వ్యాధి నిర్ధరణ పరీక్షలు చేయనున్నట్లు తెలిపింది.
ఇదీ చూడండి: వాటి కోసం 'జూమ్' వాడకం సురక్షితం కాదు: కేంద్రం