నూతన వ్యవసాయ చట్టాలపై రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రతిపక్ష కాంగ్రెస్, ఆప్లపై విమర్శలు గుప్పించారు భాజపా జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర. దేశంలోని ప్రతి రాష్ట్రంలో భాజపా అద్భుత పనితీరు కనబురుస్తోందని, అది చూసి ఓర్వలేకనే ఈ విధంగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"అసోం బీటీసీ, కశ్మీర్ డీడీసీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాజపా అద్భుత పనితీరు కనబరిచింది. భాజపా విజయాల్ని జీర్ణించుకోలేకే.. ప్రతిపక్షాలు సాగు చట్టాలపై అసత్యాలు ప్రచారం చేస్తున్నాయి. మూడు సాగు చట్టాల బిల్లులకు నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి అన్ని ఎన్నికల్లో భాజపా గెలిచింది. పేదలు, రైతులు, ఇతరులకు పీఎం మోదీ నిజమైన సానుభూతిపరుడు. పేదలు, గ్రామాలు, రైతులు దేశానికి వెన్నెముక. రైతులు, పేదలు, కార్మికులు మాతో ఉండబట్టే వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన ఎన్నికల్లో భాజపా విజయం సాధించింది."
- సంబిత్ పాత్ర, భాజపా జాతీయ ప్రతినిధి.
ప్రధాని మోదీ రైతులకు కొత్త తరం స్వేచ్ఛను ఇచ్చారని పేర్కొన్నారు సంబిత్ పాత్ర. రైతుల ఆందోళనలను ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నారో అందరికి తెలుసునన్నారు. రాహుల్ గాంధీ, ఇతర విపక్ష నేతలు కరోనా వైరస్ వ్యాప్తి గురించి గందరగోళం సృష్టించారని ఆరోపించారు. అలాగే.. వలస కార్మికులు, సాగు చట్టాలపై అసత్యాలు ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. రైతుల సమస్యలపై రాహుల్ గాంధీకి ఎంతమాత్రం తెలుసని ప్రశ్నించారు.
ఎంఎస్పీ కొనసాగుతుంది..
దేశంలోని చాలా మంది రైతులు కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలకు అనుకూలంగా ఉన్నారని పేర్కొన్నారు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పరషోత్తం రుపాలా. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ని చట్టం పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం లేదన్నారు. ఎంఎస్పీ అమలులోనే ఉంటుందని స్పష్టం చేశారు. ఆందోళనలు చేపడుతున్న రైతులు చర్చలకు రావాలని కోరారు.
ఇదీ చూడండి: 'సాగు చట్టాల వల్ల తీవ్ర స్థాయికి ద్రవ్యోల్బణం'