భారత రాజ్యాంగ విశేషాలు ఎన్ని చెప్పుకున్నా తక్కువే. ఒకటా రెండా ఎన్నో ప్రత్యేకమైన విశేషాలతో ఏడు దశాబ్దాల పాటు దేశానికి మార్గదర్శిగా నిలిచింది. ఎన్నో వివాదాస్పద అంశాలకు పరిష్కారం చూపింది. పైకి మనకు తెలుసు అని అనుకునే అంశాల కన్నా మనకు తెలియని విషయాలు ఆసక్తికరంగా అనిపించక మానవు.
రాజ్యాంగ దినోత్సవం..
భారత రాజ్యాంగం అధికారికంగా అమల్లోకి వచ్చింది 1950 జనవరి 26 అన్న విషయం అందరికి తెలుసు. అందుకే ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవం నిర్వహిస్తారు. అయితే 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా పరిగణిస్తారు. 1950 జనవరి 26 ఉదయం 10:18 గంటలకు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత గణతంత్ర రాజ్యంగా అవతరించింది భారత్. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సమయంలో దాదాపు 283 రాజ్యాంగసభ సభ్యులు సంతకం చేసారు. ఆ సమయంలోనే వర్షంపడటంతో చాలామంది దాన్ని దేశానికి శుభసూచకంగా భావించారు.
అదే రోజు అంటే 1950 జనవరి 26న గణతంత్ర భారత్కు తొలి రాష్ట్రపతిగా డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ నియమితులయ్యారు. అదే సమయంలో స్వతంత్ర భారత్కు తొలి న్యాయశాఖ మంత్రిగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వ్యవహరించారు. తొలి గణతంత్ర దినోత్సవానికి ఇండోనేసియా అధ్యక్షుడు సుకర్నో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 1955లో జనవరి 26న తొలిసారి గణతంత్ర పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాకిస్థాన్ తొలి గవర్నర్ జనరల్ మాలిక్ గులాం మొహమ్మద్ ముఖ్య అతిథిగా విచ్చేసారు.
సత్యమేవ జయతే..
రాజ్యాంగం, దేశానికి నినాదమైన సత్యమేవ జయతేను మండుకోపనిషత్, అధర్వణ వేదం నుంచి స్వీకరించారు. భారత దేశానికి ఈ నినాదం ఉండాలని తొలిసారిగా చెప్పింది పండిట్ మదన్ మోహన్ మాలవీయా.
జాతీయ గీతంగా.. జనగణమన
గణతంత్ర రాజ్యంగా భారత్ అవతరించిన తేది 26 కన్నా రెండు రోజుల ముందు అంటే జనవరి 24న జనగణమనను జాతీయ గీతంగా స్వీకరించారు. బంకించంద్ర ఛటర్జీ రాసిన వందే మాతరాన్ని జనవరి 24నే జాతీయ గేయంగా ప్రకటించారు. జాతీయ చిహ్నాన్నీ 1950 జనవరి 26న తీసుకున్నారు. తొలిసారిగా జాతీయ చిహ్నాన్ని 1947లో రూపొందించారు. ప్రస్తుతం ఉన్న రూపును మాత్రం జనవరి 26న స్వీకరించారు.
రెండేళ్ల 11 నెలల 18 రోజులు
1946 డిసెంబర్ 9న సమావేశమైన తొలి రాజ్యాంగ సభకు అధ్యక్షుడిగా సచ్చిదానంద సిన్హా వ్యవహరించారు. తర్వాత రెండేళ్ల 11నెలల 18 రోజులకు రాజ్యాంగానికి తుదిరూపు కల్పించారు. రాజ్యాంగం పూర్తయిన తర్వాత దానిని చర్చకు పెట్టగా దాదాపు 2వేల వరకూ సవరణలకు ప్రతిపాదనలు వచ్చాయి. 11 సార్లు సమావేశమైన రాజ్యాంగ సభ తుదిరూపు 11వ సమావేశంలో ఖరారు అయింది.
ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం..
ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగంలో 26 భాగాలు, 12 షెడ్యూళ్లు 448 అధికకరణలు ఉన్నాయి. రాజ్యాంగం ఇంగ్లీషు ప్రతిలో దాదాపు 1,17,369 పదాలున్నాయి. ఇంగ్లీషు, హిందీ రెండు కాపీలు చేతితోనే రాశారు. హిందీ, ఇంగ్లీషులో రాసిన రాజ్యాంగం అసలు కాపీలు హీలియంతో నింపిన ప్రత్యేకమైన కేసుల్లో పార్లమెంటు లైబ్రరీలో భద్రపరిచారు. రాజ్యాంగ ప్రతులను ప్రేమ్ బిహరీ నారాయణ్ అనే వ్యక్తి ఇటాలిక్ శైలిలో అందంగా రాశారు. ఇందుకోసం ఆయన ఆరు నెలల సమయాన్ని వెచ్చించి దాదాపు 254 పాళీలు ఉపయోగించారు. ఇందుకు ప్రతిఫలంగా ఏమి తీసుకోని ప్రేమ్ బిహారీ.. కేవలం తన పేరును ప్రతిపేజీలో ఉండేలా కోరారు.