మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి పార్టీలు. ప్రధాన కూటములైన అధికార భాజపా-శివసేన, ప్రతిపక్ష కాంగ్రెస్-ఎన్సీపీలు కీలకమైన పశ్చిమ మహారాష్ట్ర, ముంబయి-కొంకణ్లపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గాను.. నిర్ణయాత్మక పాత్రను పోషించేలా ముంబయి-కొంకణ్లో 75, పశ్చిమ మహారాష్ట్రలో 71 స్థానాలున్నాయి.
పశ్చిమాన పట్టు ఎవరిది?
సంప్రదాయబద్ధంగా పశ్చిమ మహారాష్ట్ర (కొల్హాపుర్, సాంగ్లీ, సతారా, పుణె, షోలాపుర్ జిల్లాలు)లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి కొంత పట్టుంది. 2014లో మొత్తం 41 స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించగా వాటిలో 19 ఈ ప్రాంతం నుంచే ఉన్నాయి. ఈ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ ఆ పార్టీ సాధించిన 4 స్థానాల్లో 3 ఈ ప్రాంతానికి చెందినవే. మిగతా ప్రాంతాలతో పోలిస్తే పశ్చిమ మహారాష్ట్ర సుసంపన్నంగా ఉంటుంది. విస్తృత సాగునీటి సౌకర్యాలు, మంచి వర్షాలతో పంటలు బాగా పండుతాయి. సహకార ఉద్యమంలోనూ ఈ ప్రాంతానిది కీలకపాత్రే. సహకార ఉద్యమానికి కాంగ్రెస్, ఎన్సీపీలు సహకరించడంతో సహకార చక్కెర కర్మాగారాలు, డెయిరీలు ఏర్పడ్డాయి. మరాఠాల జనాభా ఎక్కువ. చాలాకాలం పాటు వారిలో ఎక్కువ మంది కాంగ్రెస్కు అనుకూలంగా ఉంటూ వచ్చారు.
భాజపా అప్పట్లో ఈ ప్రాంతాల్లో అంతగా ప్రభావం చూపలేకపోయింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పరిస్థితి మారింది. అప్పటికి ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత, యువత ఆశలను కాంగ్రెస్-ఎన్సీపీ నాయకత్వాలు అంతగా నెరవేర్చలేకపోవడం, మోదీ ప్రభంజనం వంటివన్నీ భాజపాకు కలిసొచ్చాయి. ఆ ఎన్నికల్లో భాజపా 24 చోట్ల విజయం సాధించింది. వేరుగా తలపడిన శివసేన 13 స్థానాల్లో గెలుపొందింది. ఈ నేపథ్యంలో భాజపా, శివసేనలు ఈ ప్రాంతంలో మెజారిటీ సాధించాలన్న పట్టుదలతో ఉన్నాయి. రాష్ట్రంలోను, కేంద్రంలోనూ భాజపా అధికారంలో ఉండటం ఆ కూటమికి కలిసొచ్చే అంశం. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆ పార్టీలు పుంజుకున్నాయి. క్రమేపీ కాంగ్రెస్-ఎన్సీపీల నుంచి భాజపా, శివసేనల్లో చేరికలు పెరుగుతూ వచ్చాయి. తాజా ఎన్నికల్లో మంచి ఫలితాలొస్తాయని భాజపా, శివసేనలు అంచనాలు వేస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఎక్కువ మంది భాజపా-శివసేన కూటమి అభ్యర్థులు నిన్న మొన్నటి దాకా కాంగ్రెస్, ఎన్సీపీల్లో ఉన్నవారే. అలాగే కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి అభ్యర్థులు కూడా వారికి సుపరిచితులు, బంధువులే. దీంతో ఒకరిపై ఒకరు అంతగా విమర్శలు కూడా చేసుకోలేని పరిస్థితి ఉంది.
మరాఠాలకు చేరువగా..
గత ఐదేళ్లలో భాజపా అధికారంలో ఉండటంతో మరాఠాలకు చేరువైంది. రిజర్వేషన్లు వంటి అంశాల్లో వారి సమస్యలను పరిష్కరించగలిగింది. వ్యూహాత్మకంగా గత ఏడాది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మరాఠాలకు చెందిన చంద్రకాంత్ పాటిల్ (కొల్హాపుర్)ను నియమించింది. మంత్రివర్గంలో కూడా ఆయన ముఖ్యమంత్రి తర్వాత కీలక స్థానంలో ఉన్నారు.
ముంబయి-కొంకణ్లో పైచేయి ఎవరిదో?
శివసేనకు ముంబయి ఎప్పుడూ ప్రాణవాయువే. ఆ పార్టీ ఇక్కడి మరాఠాల ప్రయోజనాలను కాపాడుతూ వస్తోంది. చాలాకాలం ముంబయి మున్సిపల్ కార్పొరేషన్లో పార్టీ హవా కొనసాగడంతో ఇక్కడ గట్టి పట్టుంది. క్రమేపీ భాజపా కొన్ని ప్రాంతాల్లో బలం పుంజుకుంది. ముంబయిలో మొత్తం 36 స్థానాలకు గాను శివసేన 19, భాజపా 17 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఇక్కడ ఎన్సీపీకి అంత పట్టు లేకపోగా.. కొంత ప్రాబల్యం ఉన్న కాంగ్రెస్ అంతర్గత కలహాలతో కొట్టుమిట్టాడుతోంది. పార్టీ కీలకనేత సంజయ్ నిరుపమ్ బాహాటంగానే అసమ్మతిని తెలుపుతున్నారు. ముంబయికి ఆనుకుని ఉన్న కొంకణ్ తీర జిల్లాల్లో 39 స్థానాలున్నాయి. ఇక్కడి ప్రజలకు ముంబయితో విడదీయలేని సంబంధాలున్నాయి. ఎక్కువ మంది అక్కడే పనిచేస్తూ రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో ముంబయిలోని పరిస్థితే ఇక్కడా కనిపిస్తుంటుంది. ఈ జిల్లాల్లో శివసేనదే పైచేయిగా కనిపిస్తోంది. అయితే కొన్నిచోట్ల భాజపా తిరుగుబాటు అభ్యర్థుల బెడద ఆ పార్టీకి ఉంది. కాంగ్రెస్, ఎన్సీపీలకూ కొన్ని ప్రాంతాల్లో పట్టు ఉండటంతో మంచి పోటీ ఇస్తున్నాయి.
‘మిగతా’ మొగ్గు భాజపా-సేనకే!
పశ్చిమ మహారాష్ట్ర, ముంబయి-కొంకణ్ ప్రాంతాలు కాకుండా మిగతా చోట్ల భాజపా-శివసేన కూటమి బలంగా కనిపిస్తోంది. అయితే ఆయా ప్రాంతాల్లోనూ ‘తిరుగుబాటు’ అభ్యర్థుల బెడద ఉంది. వీరి ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి. విదర్భలో 2014లో 62 స్థానాలకు పోటీచేసిన భాజపా 44 చోట్ల విజయం సాధించింది. ఈసారి మరింత బలం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మరఠ్వాడా, ఉత్తర మహారాష్ట్రలోనూ భాజపా-శివసేన కూటమిదే పైచేయిగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మరఠ్వాడా కొంకణ్ ప్రాంతాల నుంచి ఎన్సీపీ కేవలం 8 సీట్లు మాత్రమే సాధించింది. విదర్భ ప్రాంతంలో 71 స్థానాలుండగా ఆ పార్టీకి ఒక్కటే దక్కింది. కాంగ్రెస్కు మొత్తం 46 స్థానాలు దక్కగా వాటిలో విదర్భ నుంచి 10, మరఠ్వాడా నుంచి 9 గెలుచుకుంది.
ఇదీ చూడండి: 'అధికారం కాంగ్రెస్దే.. ఆపడం ఎవరితరం కాదు'