బిడ్డల కోసం జీవితాన్నే త్యాగం చేసే అమ్మ రుణం ఏమిచ్చి తీర్చగలం? ఆమెకు ఇంటి పనుల్లో కాసింత సాయం చేస్తేనే ఎంతో మురిసిపోతుంది తల్లి. అయితే బంగాల్లో ఓ యువతి.. అమ్మ కోసం ఏకంగా బావినే తవ్వేసింది. కుటుంబానికి నీటి కష్టాన్ని తీర్చేసింది. అమ్మకు కుమారుడైనా, కూతురైనా తానేనని భరోసా ఇచ్చింది.
రాణిగంజ్ తాలూకా బక్తార్నగర్కు చెందిన బబిత 2018లో పొలిటికల్ సైన్స్లో ఎంఏ పూర్తి చేసి.. ప్రస్తుతం బర్దమాన్ వర్సిటీలో బీఈడీ చేస్తోంది. లాక్డౌన్ కారణంగా హాస్టల్ నుంచి ఇంటికొచ్చింది బబిత. ఊరి చివర ఓ చిన్న ఇల్లు వారిది. ఆ ఇంటి దరిదాపుల్లో నీటి పైపులు లేవు. నీటి కోసం అమ్మ రోజూ కిలోమీటర్ల మేర నడిచి.. బిందెల్లో నీళ్లు మోసుకొచ్చేది. చిన్నప్పటి నుంచి అమ్మ కష్టాన్ని చూస్తూ పెరిగిన బబిత.. అమ్మ కోసం ఏదో ఒకటి చేయాలనుకుంది.
బావి తవ్వించడమో, బోర్ వేయించడమో చేద్దామంటే.. అంత స్తోమత వారి కుటుంబానికి లేదు. దీంతో పారా, బుట్టా చేతబట్టింది. ఇంటిముందున్న కాస్త స్థలంలోనే ఓ బావి తవ్వడం మొదలెట్టింది.
"నా కూతురు.. నేను అంత దూరం నుంచి నీరు మోసుకురావడం చూడలేకపోయింది. అందుకే బావి తవ్వడం మొదలెట్టింది. ముందు ఓ ఇద్దరు కూలీలను పెట్టి తవ్విద్దామనుకుంది. గ్రామ పంచాయతీకి వెళ్లి కనుక్కుంటే, బావి తవ్వేందుకు రూ. 5000 అడిగారు. కానీ, మా దగ్గర అంత డబ్బు లేదు. డబ్బంతా బావికే పెట్టేస్తే పిల్లల చదువులెలా? "
-మీనా సోరెన్, బబిత తల్లి
బబిత సంకల్పానికి మెచ్చి... 18 అడుగులు తవ్వగానే నేలమ్మ కనికరించి నీళ్లిచ్చింది. తల్లి, చెల్లి సాయంతో ఇంకొన్ని అడుగులు తవ్వితే ఆ నీరు నిత్యం ఊరుతూ.. వారి కష్టాలు తీరుస్తాయంటోంది బబిత.
"నేను బావి తవ్వడానికి మా అమ్మే కారణం. అమ్మ నీళ్ల కోసం కిలోమీటర్ల మేర నడిచేది... ఇప్పటికీ నడుస్తూనే ఉంది. పగిలిన అమ్మ పాదాలను ఇక చూడలేక, బావి తవ్వడం మొదలెట్టాను. మొదట్లో కాస్త కష్టంగా అనిపించింది. కానీ, వర్షం పడ్డాక నేల కాస్త మెత్తబడింది, సులభంగా 18 అడుగులు తవ్వాను. కాస్త నీరొచ్చింది. కానీ, ఇంకాస్త తవ్వితే.. మా నీటి కష్టాలు తీరిపోతాయి. "
-బబితా సోరెన్
ఇదీ చదివేయండి: పనస పండ్లు కోయడానికి బ్రిడ్జ్ నిర్మాణం!