'పదిమంది నిందుతులు తప్పించకున్నా కానీ ఒక నిరపరాదికి శిక్ష పడకూడదు' అని ఐపీసీ నిర్దేశిస్తుంది. అందుకే ఖైదీలు తమ గోడు చెప్పుకొని, నిర్ధోషులుగా నిరూపించుకునేందుకు కోర్టులు ట్రయల్స్కు అవకాశం ఇస్తాయి. అయితే కరోనా దెబ్బకు ఆ సేవల సంఖ్య గణనీయంగా తగ్గిందట. దీనికి కారణం వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అత్యవసర కేసులను మాత్రమే న్యాయస్థానాలు విచారించడం. ఈ నేపథ్యంలో దాదాపు 69 శాతానికి పైగా ఖైదీలు విచారణకు హాజరుకాలేక జైళ్లలోనే మగ్గుతున్నారు. ఈ మేరకు కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్(సీహెచ్ఆర్ఐ) అనే ప్రపంచ స్థాయి సంస్థ ఓ నివేదిక విడుదల చేసింది. ట్రయల్స్ జరగకపోవడం వల్ల దాదాపు 2019 నుంచి చాలా మంది జైలు శిక్ష అనుభవిస్తున్నారని అందులో పేర్కొన్నారు.
పది అంశాలపై...
2019 ప్రభుత్వ అధికారిక జైళ్ల వివరాలను పరిశీలించిన సీహెచ్ఆర్ఐ.. దాదాపు 10 అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ నివేదిక తయారు చేసింది.
జైళ్లలో జనాభా-పరిమితి, ఖైదీల నిష్పత్తి, అండర్ ట్రయల్స్లో ఉన్న ఖైదీల నిర్బంధం కాలం, మహిళలు-జైళ్లు, ఖైదీల విద్య, కుల, మతపరమైన ప్రొఫైల్, జైలు సిబ్బంది, నేరాల వారీగా ఖైదీల వివరాలు, కారాగారం తనిఖీలు, ఖైదీలపై ఖర్చు, జైళ్లలో మరణాలు వంటి అంశాల ఆధారంగా ఈ నివేదిక రూపొందించినట్లు సీహెచ్ఆర్ఐ పేర్కొంది
- దేశవ్యాప్తంగా జైళ్లలో 4.78 లక్షల మంది ఖైదీలు ఉన్నారు. రద్దీ రేటు 18.5 శాతంగా ఉంది.
- 18.8 లక్షల మంది జైళ్లలో(ట్రయల్స్ కోసం ఎదురుచూస్తున్న వారితో కలిపి) ఉన్నారు. వారిలో 4.3 శాతం మంది మహిళలు ఉన్నారు.
- దేశంలో మొత్తం 19,913 మంది మహిళా ఖైదీలు ఉన్నారు.
- 69.05 శాతం మంది ఖైదీలు విచారణ కోసం ఎదురుచూస్తున్నారు. వారిలో నాల్గవ వంతు మంది ఇప్పటికే ఒక సంవత్సరానికి పైగా జైళ్లలో గడిపారు.
- 116 మంది ఖైదీలు ఆత్మహత్య చేసుకొని మరణించగా.. 7,394 మంది ఖైదీలు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు.
- 5,608 మంది విదేశీ ఖైదీలు ఉండగా.. వారిలో 832 మంది మహిళలు ఉన్నారు.
- జైళ్లలో మొత్తం 1,775 మంది ఖైదీలు మరణించారు. వారిలో 1,544 మంది అనారోగ్యం, వృద్ధాప్యం కారణంగా చనిపోయారు.
- జైళ్లలో 30 శాతం సిబ్బంది స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 12.8 శాతం మాత్రమే మహిళలు పనిచేస్తున్నారు.
- ప్రతి జైలులో సగటును ఒక్కో వ్యక్తిపై రోజుకు రూ.118 రూపాయలు ఖర్చు చేస్తున్నారు.
సీహెచ్ఆర్ఐ నివేదిక ప్రకారం... 2019 లో మొత్తం జాతీయ జైళ్ల ఆక్యుపెన్సీ రేటు 118.5 శాతంగా ఉంది. ఇది గత ఐదేళ్లలో అత్యధికం. జిల్లా జైళ్లు, కేంద్ర జైళ్లు వరుసగా 129.7 శాతం, 123.9 శాతం ఆక్యుపెన్సీ రేటుతో నిండిపోయాయి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో దిల్లీలోనే అత్యధికంగా 174.9 శాతం ఆక్యుపెన్సీ రేటుతో ముందంజలో ఉంది.
టాప్లో ఉన్న ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చూస్తే.. దిల్లీ (174.9 శాతం), ఉత్తరప్రదేశ్ (167.9 శాతం), ఉత్తరాఖండ్ (159 శాతం), మేఘాలయ (157.4 శాతం), మధ్యప్రదేశ్ (155.3 శాతం), సిక్కిం (153.8 శాతం) , మహారాష్ట్ర (152.7 శాతం), ఛత్తీస్ఘర్(150.1 శాతం) 150 శాతం పైన ఆక్యుపెన్సీ రేటును కలిగి ఉన్నాయి.
గత ఐదేళ్లలో...
గత ఐదేళ్లలో జైళ్ల సామర్థ్యం 10.1 శాతం పెరిగితే.. మొత్తం జైళ్లలో ఉన్నవారి సంఖ్య 14.1 శాతం పెరిగింది. ఈ ఐదు సంవత్సరాల్లో అండర్ ట్రయల్ ఖైదీలు 17.2 శాతం పెరిగారు. 2019 చివరినాటికి దేశంలోని 1350 జైళ్లలో 4,78,600 మంది ఖైదీలు ఉన్నారు. వారిలో 3,30,487 మంది శిక్ష అనుభవిస్తున్నారు.
"ప్రపంచ వ్యాప్తంగా జైళ్లలో చేరుతున్న వారి సంఖ్య 2015 నుంచి 2018 వరకు 3.7 శాతం పెరిగింది.ఈ మూడేళ్ల కాలంలో 3,86,485 మంది ఖైదీలను చేరారు. వారిలో 46,461 (12 శాతం) మంది భారతదేశంలోనే ఉన్నారు. లక్ష జనాభాలో 35 మంది ఖైదీలు అవుతున్నారు. ఖైదీల సంఖ్య ఆధారంగా చూస్తే.. 223 దేశాల్లో భారత్ 211వ స్థానంలో ఉంది"
--కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్(సీహెచ్ఆర్ఐ)
ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్ మాత్రమే...
సీహెచ్ఆర్ఐ నివేదిక ప్రకారం.. గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్ జైళ్లలో మాత్రమే ఖైదీల సంఖ్య తగ్గుతోంది. 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ జైళ్లలో ఖైదీల సంఖ్యను 2015 నుంచి 2019 మధ్య 20 శాతానికి పైగా పెంచాయి. సిక్కిం (59.4 శాతం), జమ్మూ కశ్మీర్ (57.6 శాతం) అత్యధికంగా జైళ్లలో మగ్గుతున్నారు. అయితే జాతీయ స్థాయిలో చూస్తే 10 మందిలో ఏడుగురు దోషులుగా నిర్ధరణ కావట్లేదు.