పంజాబ్లోని తరన్ తరన్ జిల్లాలో ఓ ఊరేగింపులో అపశ్రుతి చోటు చేసుకుంది. బాణాసంచా ఉంచిన ట్రాక్టర్లో పొరపాటున నిప్పురవ్వలు పడి పేలుడు సంభవించింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. పాహు గ్రామంలో నగర్ కీర్తన్ పేరిట ఊరేగింపు నిర్వహిస్తున్నసమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఊరేగింపు కోసం ట్రాక్టర్లో బాణాసంచా తీసుకువస్తుండగా ప్రమాదవశాత్తూ పేలింది. పేలుడుతో ఊరేగింపులో పాల్గొన్న భక్తులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. ట్రాక్టర్ తునాతునకలైంది.
క్షతగాత్రులను వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
స్థానికుల సమాచారం మేరకు..
మరోవైపు ఈ ప్రమాదంలో దాదాపు 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారని పోలీసులు వెల్లడించారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది 18-19 మధ్య వయస్కులేనని చెప్పారు. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు.
ముఖ్యమంత్రి స్పందన..
ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మృతులకు రూ.5లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు ఉచిత వైద్యం అందించనున్నట్లు వెల్లడించారు. ప్రమాదంపై వెంటనే విచారణకు ఆదేశించినట్లు చెప్పారు.
ఇదీ చూడండి:కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద ఐదుగురు!