ఝార్ఖండ్లో నేడు మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 13 స్థానాల్లో 189 మంది బరిలో నిలిచారు. 37,83,055 మంది ఓటర్లు... 189 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది.
కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సహా.. ఇతర ప్రముఖులు ఎన్నికల బరిలో ఉన్నారు. 3,906 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగనుంది. మారుమూల ప్రాంతాల్లోని ప్రజలు కూడా ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశామని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. పోలింగ్ ఉదయం 7 గంటలకే ప్రారంభమై.. మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది.
భాజపాకు మహా కూటమి పోటీ....
ఝార్ఖండ్లో ప్రస్తుతం భాజపా అధికారంలో ఉంది. తొలి దశలో కాషాయ పార్టీ 12 చోట్ల పోటీ చేస్తుండగా.. ఒక చోట స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. రాష్ట్రంలో భాజపాకు పోటీగా కాంగ్రెస్, ఝార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం), ఆర్జేడీ మహా కూటమిగా ఏర్పడ్డాయి. జేఎంఎం 4, కాంగ్రెస్ 6, ఆర్జేడీ 3 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.
ఝార్ఖండ్లో మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. మొత్తం 5 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. డిసెంబరు 23న ఫలితాలు వెలువడనున్నాయి.