చౌదరి దేవీలాల్, బన్సీ లాల్, భజన్ లాల్... హరియాణా రాజకీయాల్లో కీలక శక్తులు. 1996లో పంజాబ్ నుంచి విడిపోయి హరియాణా రాష్ట్రం ఏర్పడ్డాక దాదాపు 30 ఏళ్ల పాటు ఈ ముగ్గురే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. రెండున్నర పుష్కర కాలాల పాటు హరియాణాను పరిపాలించి తమ కుటుంబాలకు ప్రత్యేక వారసత్వాన్ని అందించారు. ఆ వారసత్వాన్నే ఆసరాగా చేసుకుని... ఆ 3 కుటుంబాలకు చెందిన 10 మంది ఈ ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకుంటున్నారు.
దేవీలాల్ కుటుంబం నుంచి...
మాజీ ఉప ప్రధాని, హరియాణా మాజీ ముఖ్యమంత్రి 'దేవీలాల్' కుటుంబం నుంచి.. అతిపిన్న వయసులోనే ఎన్నికల బరిలోకి దిగిన నేతగా గుర్తింపు పొందారు ఆయన ముని మనువడు దుష్యంత్ చౌతాలా. 31 ఏళ్ల వయసులోనే రాజకీయ రంగప్రవేశం చేసిన ఆయన... 2014 పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. హిసార్ లోక్సభ ఎంపీగా విజయకేతనం ఎగురవేశారు. అయితే 2018లో అధికార కలహాలతో స్వయానా అయన తాత ఓం ప్రకాశ్ చౌతాలా దుష్యంత్ను ఐఎన్ఎల్డీ నుంచి బహిష్కరించారు. ఫలితంగా 2018 డిసెంబర్ 9న 'జన్ నాయక్ జనతాపార్టీ (జేజేపీ)'ని స్థాపించారు దుష్యంత్.
ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో ఉచానా కలన్ నియోజక వర్గం నుంచి మాజీ కేంద్రమంత్రి చౌదరి బీరేందర్ సింగ్ భార్య, సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రేమ్లతపై దుష్యంత్ పోటీ చేస్తున్నారు. దుష్యంత్ తల్లి 'నైనా చౌతాలా' జేజేపీ అభ్యర్థిగా బాధ్రా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో దబ్వాలీ స్థానంలో పోటీ చేసిన ఆమె.. ఐఎన్ఎల్డీ పార్టీ తరఫున విజయం సాధించారు.
ఓం ప్రకాశ్ కుమారుడైన ఐఎన్ఎల్డీ నేత, 'ఎల్లనబాద్' సిట్టింగ్ ఎమ్మెల్యే అభయ్ సింగ్ చౌతాలా మరోసారి అదే స్థానం నుంచే ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.
దేవీలాల్ నలుగురు కుమారుల్లో ఒకరైన జగదీశ్ చౌతాలా కుమారుడు ఆదిత్య సింగ్ చౌతాలా భాజపా అభ్యర్థిగా దబ్వాలీ అసెంబ్లీ స్థానంలో పోటీ చేయనున్నారు. దేవీలాల్ మరో కుమారుడు రంజిత్ సింగ్ చౌతాలా(73) కూడా ఎన్నికల బరిలో నిలిచారు. కాంగ్రెస్ ఆయనకు సీటు ఖరారు చేయనందున రనియా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారు.
భజన్లాల్ కుటుంబం
హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్లాల్ కుటుంబం పరిస్థితి మరోలా ఉంది. ఆయన ఇద్దరు కుమారులైన కుల్దీప్ బిష్నాయ్, చాందెర్ మోహన్ కాంగ్రెస్ అభ్యర్థులుగా ఎన్నికల సమరానికి సిద్ధమయ్యారు. ఆదాంపుర్, పంచకుల నియోజకవర్గాల నుంచి ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. వీరిలో చాందెర్ మోహన్ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. హరియాణాకు ఉప ముఖ్యమంత్రిగానూ పనిచేశారు.
బన్సీలాల్ X దేవీలాల్ కుటుంబం
బన్సీలాల్ కుటుంబానికి వస్తే... ఆయన కుమారుడు రణ్బీర్ సింగ్ మహేంద్ర(75)కు కాంగ్రెస్ బాధ్రా సీటు ఖరారు చేసింది. అదేస్థానంలో దుష్యంత్ తల్లి నైనా చౌతాలా జేజేపీ అభ్యర్థిగా పోటీకి దిగారు. ఈ నేపథ్యంలో బాధ్రా స్థానాన్ని ఎవరు కైవసం చేసుకుంటారో అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. గతంలో బీసీసీఐ అధ్యక్షుడిగానూ పనిచేశారు మహేంద్ర.
బన్సీలాల్ కోడలు, కాంగ్రెస్ సీనియర్ నేత కిరణ్ చౌదరి 'తోషమ్' నియోజకవర్గంలో పోటీకి సిద్ధమయ్యారు. బన్సీ అల్లుడు సోమ్వీర్ సింగ్ కూడా కాంగ్రెస్ తరఫునే ఎన్నికల బరిలో దిగుతున్నారు. 'లోహరు' సీటును సోమ్వీర్కు కేటాయించింది హస్తం పార్టీ.
2018లో రెండుగా విడిపోయిన పార్టీ
దేవీలాల్ స్థాపించిన ఇండియన్ నేషనల్ లోక్దళ్(ఐఎన్ఎల్డీ)లో ఆధిపత్యం కోసం ఆయన ఇద్దరు మనువళ్లు అజయ్ చౌతాలా, అభయ్ చౌతాల మధ్య తీవ్రస్థాయిలో పోరు నడిచింది. అజయ్తో పాటు ఆయన కుమారులు దుష్యంత్, దిగ్విజయ్ను పార్టీ నుంచి బహిష్కరించారు ఓం ప్రకాశ్ చౌతాలా. ఫలితంగా ఐఎన్ఎల్డీ పార్టీ 2018లో రెండుగా విడిపోయింది.
అదృష్టం ఎవరికో...
ఒకప్పుడు హరియాణా రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన 3 కుటుంబాల పరిస్థితి... అంతర్గత కలహాలతో మారిపోయింది. ఫలితంగా గత 15 ఏళ్లుగా ప్రజల్లో వీరి ప్రభావం తగ్గుతూ వస్తోంది. ఇప్పుడు ఎన్నికల రణక్షేత్రంలో వారి ప్రభావం ఎంత ఉంటుందో వేచిచూడాలి.