డిగ్రీ కూడా పూర్తి చేయని ఓ ముగ్గురు విద్యార్థులు అరుదైన ఘనత సాధించారు. అంతరిక్షంలో ఓ గ్రహశకలాన్ని కనుగొన్నారు. వీరి కృషిని అమెరికా అంతరిక్ష సంస్థ(నాసా) ప్రశంసించింది. వీరు కనుగొన్న ఆ గ్రహశకలంపై తాము పరిశోధన జరుపుతామని చెప్పింది.
9 నెలలపాటు..
గుజరాత్ అహ్మదాబాద్లోని ఎంజీ సైన్స్ కళాశాలలో నీరవ్ వాఘెలా, మైత్రీ మహేశ్వరి, ముంజల్ యాదవ్.. డిగ్రీ(జియాలజీ) మూడో ఏడాది చదువుతున్నారు. వీరు తొమ్మిది నెలలపాటు పరిశోధన చేసి, ఓ గ్రహశకలాన్ని కనుగొన్నారు. దానిని సెప్టెంబరు 20న ఐఏఎస్సీ-నాసా నిర్వహించిన 'ఆస్టరాయిడ్ హంటింగ్ కాంపిటీషన్'కు పంపారు. ఆ పోటీలో వీరు కనుగొన్న గ్రహశకలాన్ని నాసా గుర్తించింది.
![asteroid invented by students](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/2_3010newsroom_1635583131_60.jpg)
![asteroid invented by students](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4_3010newsroom_1635583131_245.jpg)
ఆ 9 గ్రహశకలాల్లో..
ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 4,000 ప్రాథమిక గ్రహశకలాలను కనుగొన్నారు. వాటిలో మొత్తం 9 గ్రహశకలాలను నాసా గుర్తించగా... అందులో ఎంజీ సైన్స్ కళాశాల విద్యార్థులు కనుగొన్న గ్రహశకలం కూడా ఉంది. సూర్యుడి నుంచి దూరం, కక్ష్య సమయాన్ని నిర్ణయించిన ఏకైక గ్రహశకలం ఇదేనని నాసా ప్రశంసించింది. ఈ మేరకు విద్యార్థులకు సమాచారం అందించింది. ఈ గ్రహశకలానికి విద్యార్థుల(మైత్రి, నీరవ్, ముంజల్) పేరు మీదుగా 'ఎంఎన్ఎం0101' గా నామకరణం చేసినట్లు చెప్పింది.
![asteroid invented by students](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/1_3010newsroom_1635583131_165.jpg)
![asteroid invented by students](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3_3010newsroom_1635583131_17.jpg)
2030 జులై 12న ఈ గ్రహశకలం.. భూమికి దగ్గరగా వస్తుందని నాసా తమకు మెయిల్ ద్వారా తెలియజేసిందని గ్రహశకల పరిశోధనలో పాల్గొన్న నీరవ్ వాఘెలా తెలిపారు. దీనిపై నాసా పరిశోధన చేయనుందని చెప్పారు.
గ్రహశకలం ఎంత దూరంలో ఉందంటే..?
సూర్యుడి నుంచి ఈ గ్రహశకలం 2.15 ఆస్ట్రానామికల్ యూనిట్స్ దూరంలో ఉంది. అంటే.. దాదాపు 32,16,65,422 కి.మీ. దూరం అన్నట్లు. సూర్యుడి చుట్టూ భూమి తిరగడానికి 365 రోజుల సమయం పడితే... ఈ గ్రహశకలం సూర్యుడి చుట్టూ తిరగడానికి 1,150 రోజుల సమయం పడుతుంది. ఈ గ్రహశకలం సిగ్నల్ టు నాయిస్ రేషియా(ఎస్ఎన్ఆర్) దాదాపు 5.8గా ఉంది. ఇది గాలితో తయారైంది. దీని అధికారిక ఐడీ- 2021BC5. ఇందులో తక్కువ ఖనిజాలు ఉన్నాయి. ఈ మేరకు నాసా తన వెబ్సైట్లో గ్రహశకలం గురించి వివరాలు పొందపరించింది.
ప్రిన్సిపల్ హర్షం...
తమ విద్యార్థులు సాధించిన ఈ ఘనతపై ఎంజీ కళాశాల ప్రిన్సిపల్ వివేక్ ఉపాసనీ హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల పరిశోధనను నాసా గుర్తించడం సంతోషంగా ఉందన్నారు. వీరు కనుగొన్న గ్రహశకలంపై 2030లో పరిశోధన చేస్తామని నాసా హామీ ఇచ్చిందని చెప్పారు. గ్రాడ్యుయేషన్ పూర్తి కాకుండానే, తక్కువ వనరులతోనే తమ విద్యార్థులు ఈ పరిశోధన చేశారని కొనియాడారు.
ఇదీ చూడండి: గ్రహశకలంపై కలకలం సృష్టించిన వ్యోమనౌక!
ఇదీ చూడండి: స్పేస్ఎక్స్ ప్రయోగం బుధవారానికి వాయిదా