వైఎస్సార్సీపీ లీగల్ సెల్లో వర్గ విభేదాలు - కష్టకాలంలో పార్టీకి పని చేస్తే గుర్తింపు ఇవ్వలేదని ఆవేదన
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 24, 2023, 10:01 AM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/24-12-2023/640-480-20343626-thumbnail-16x9-ysrcp-legal-cell-dispute-two-factions-in-department.jpg)
YSRCP Legal Cell Dispute Two Factions In Department : ఉమ్మడి అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ లీగల్ సెల్ విభాగంలో రెండు వర్గాల మధ్య వివాదం జరిగింది. నగరంలోని చలమారెడ్డి కన్వెన్షన్ హాలులో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో విస్తృతస్థాయి సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి మాట్లాడుతుండగా మాజీ అధ్యక్షుడు నారాయణరెడ్డి వర్గం సభలో బైఠాయించి ఆందోళన చేపట్టారు. వైసీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి పనిచేస్తే తగిన గుర్తింపు ఇవ్వలేదని నారాయణరెడ్డి మండిపడ్డారు. అధికారంలో లేనప్పుడు వైసీపీ, విద్యార్ధి సంఘాల నేతల కేసులన్నీ వాదిస్తే, అధికారంలోకి వచ్చిన తర్వాత అన్యాయం చేస్తారా అంటూ నారాయణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
సమావేశం కొద్దిసేపు జరిగిన అనంతరం రసాభాసగా మారింది. తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలంటూ లీగల్ సెల్ జిల్లా మాజీ అధ్యక్షుడు నారాయణ రెడ్డి వేదిక మీదకు ఎక్కి మైకు తీసుకునే ప్రయత్నం చేయటంతో తోపులాట, వాగ్వాదం జరిగింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఒక వర్గం వారిని అక్కడ నుంచి పంపించడంతో గొడవ సద్దుమణిగింది. నారాయణరెడ్డిని లీగల్ సెల్ నుంచి బహిష్కరిస్తున్నామని జోనల్ ఇన్ఛార్జి లింగాల లోకేశ్వరరెడ్డి ప్రకటించారని జిల్లా అధ్యక్షుడు ఉమాపతి తెలిపారు.