YCP Leader Sons Attacked on A Person: రెచ్చిపోయిన వైసీపీ నేత కుమారులు.. వ్యక్తిపై దాడి.. ఆస్పత్రిలో బాధితుడు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 8, 2023, 12:44 PM IST
YCP Leader Sons Attacked on A Person: వైసీపీ నేతల ఆగడాలు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయి. తమకు అడ్డు వచ్చిన వారిపై విచక్షణారహితంగా దాడులకు తెగబడుతున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు చాలానే వెలుగుచూసినా.. కడప జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. కడపలో ఓ వైసీపీ నాయకుడి కుమారులు సహా మరికొందరు యువకులు.. ఓ వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఇనుప రాడ్లతో దాడికి తెగబడటంతో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి.
కడప బిస్మిల్లానగర్కు చెందిన నూర్ బాషా శనివారం రాత్రి 11 గంటల సమయంలో.. ఇంటికి వెళ్తున్నారు. ఈ సమయంలో.. కొందరు యువకులు వాహనాలను రోడ్డుకు అడ్డుగా ఉంచారు. వాటిని అడ్డు తొలగించమని అడిగినందుకు నూర్ బాషాను వైసీపీ నాయకుడి కుమారులు.. ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా కొట్టారు. దీంతో నూర్ బాషాకు తీవ్ర రక్తస్రావమైంది. ప్రస్తుతం ఆయన కడప సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైసీపీ నాయకుల ఆగడాలు పెరిగిపోతున్నాయని ప్రజలు ఆందోళన చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితుడి బంధువులు కోరారు.