అంగన్వాడీల సమ్మె అణచివేతకు ప్రభుత్వం కుట్ర పన్నింది: పట్టాభిరామ్ - ESMA
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 8, 2024, 6:48 PM IST
TDP Leader Pattabhi About Govt ESMA Orders: అంగన్వాడీ సిబ్బంది, మున్సిపల్ కార్మికులు, సర్వశిక్షా అభియాన్ సిబ్బంది, 108, 104 అంబులెన్సుల ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల మొత్తం విలువ, జగన్ రెడ్డి తన విలాసాల కోసం తగలేసిన వేల కోట్ల ప్రజల సొమ్ము ముందు దిగదుడుపేనని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. ఇచ్చిన హామీ అమలు కోసం పోరాడుతున్న వారిపై లాఠీలు ఝళిపించి, ఎస్మా చట్టాలు ప్రయోగిస్తారా అంటూ దుయ్యబట్టారు. అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు, సర్వశిక్షా అభియాన్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల మొత్తం విలువ జగన్ రెడ్డి విలాసాల కోసం తగలేసిన వేలకోట్ల ప్రజల సొమ్ము కన్నా తక్కువేనని మండిపడ్డారు.
అంగన్వాడీల డిమాండ్లు నెరవేర్చకపోగా, అక్రమంగా వారిపై ఎస్మా చట్టాన్ని ప్రభుత్వం ప్రయోగించిందని పట్టాభిరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవత్వం కూడా లేకుండా సమ్మె అణచివేతకు కుట్ర పన్నారని మండిపడ్డారు. జగన్ హామీలను నమ్మి గెలిపిస్తే అన్ని వర్గాల వారినీ రోడ్డుకు ఈడ్చారన్నారు. కాగా కనీస వేతనం పెంపు సహా డిమాండ్లు పరిష్కారం కోసం అంగన్వాడీలు చేపట్టిన ఆందోళనలు 28వ రోజుకు చేరాయి.