అత్యంత అవినీతి నేతల్లో ఎమ్మెల్యే పిన్నెల్లి - వైసీపీ పాలన, పోలీసుల వైఖరిపై బ్రహ్మారెడ్డి ధ్వజం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 26, 2023, 5:27 PM IST
TDP Julakanti Brahma Reddy on Mining in Macherla: పల్నాడు జిల్లా మాచర్లలో మైనింగ్ దోపిడీ విచ్చలవిడిగా సాగుతుందని టీడీపీ మాచర్ల ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. సింగరుట్లలో మైనింగ్ ప్రాంత పరిశీలనకు వెళ్తున్న తనని పోలీసులు గృహనిర్బంధం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం నేతలు ఎక్కడికి వెళ్లిన సరే పర్యటనకు అనుమతి లేదని గృహనిర్బంధం చేయడం ఎంతవరకు సమంజసం అని మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ పాలన, పోలీసుల వైఖరి దారుణంగా ఉందని ధ్వజమెత్తారు.
రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత అవినీతి చేసిన నేతల్లో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉంటారని బ్రహ్మారెడ్డి ఆరోపించారు. ప్రతి దానికి పోలీసులను అడ్డుపెట్టుకుంటున్నారని.. పోలీసు వ్యవస్థ సిగ్గుపడాలని అన్నారు. రాబోయే రోజుల్లో మైనింగ్ మాఫియాపై సీబీఐ విచారణ కోరుతామని.. ఆ రోజు అధికారులను ఏ ఒక్కరూ కాపాడలేరని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని బ్రహ్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ అధికారం చేపట్టిన వెంటనే ప్రతి అధికారిపైనా విచారణ చేస్తామని హెచ్చరించారు.