Secretariat Employee Absconded with Pension Money: పింఛన్ నగదుతో సచివాలయ ఉద్యోగి పరార్.. గాలిస్తున్న పోలీసులు - Volunteer scams in AP
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 8, 2023, 8:30 AM IST
Secretariat Employee Absconded with Pension Money: లబ్ధిదారులకు చెల్లించాల్సిన పింఛన్ నగదుతో సచివాలయ సంక్షేమ, అభివృద్ధి కార్యదర్శి పరారైన ఘటన విశాఖలో జరిగింది. దీనిపై జీవీఎంసీ(GVMC) జోన్-8 కమిషనర్ పొందూరు సింహాచలం న్యూపోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సమీప అయ్యన్నపాలేనికి చెందిన విల్సన్బాబు గాజువాక 65వ వార్డు సంజీవగిరి కాలనీ సచివాలయ కార్యదర్శిగా పని చేస్తున్నారు. గాత నెల 30న వార్డులోని 51 మంది పింఛన్దారులకు చెందిన లక్షా 40వేల 250 రూపాయలు బ్యాంకు నుంచి డ్రా చేసి తనవద్దే ఉంచుకున్నాడు. ఈ నెల 1,2 తేదీలు సెలవులు కావటంతో సచివాలయానికి రాలేదు. ఆ తర్వాత కూడా పింఛన్ ఇవ్వకపోవటంతో లబ్ధిదారులు సచివాలయానికి వచ్చి ఫిర్యాదు చేశారు. రోజులు గడిచినా కార్యదర్శి ఆచూకీ లేక జీవీఎంసీ అధికారులు ఆయన సొంతూరులో విచారణ జరిపారు. ఇంటికి తాళం వేసి ఉండటంతో పాటు ఫోన్ తీయకపోవడంతో అధికారులు చర్యలకు దిగారు.
విధులకు గైర్హాజరైన కారణంగా షోకాజ్ నోటీసులు వాట్సాప్లో పంపారు. అయినా స్పందన లేకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విల్సన్బాబు కృష్ణా జిల్లా నుంచి గత జులైలో ఇక్కడికి బదిలీ అయ్యారు. ఆయన సర్వీసు రికార్డు పరిశీలిస్తే రెండుసార్లు సస్పెండ్ అయినట్లు ఉందని సంబంధిత అధికారులు తెలిపారు. ఉద్దేశపూర్వకంగా నగదుతో పరారయ్యాడా, ఎక్కడికైనా వెళ్లాడా అనే అంశంపై ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు.