By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 25, 2023, 7:05 PM IST
Rs 100 Crore Cheque to Simhadri Appanna: సింహాద్రి అప్పన్న హుండీలో రూ.100 కోట్ల చెక్కు.. కానీ
A Devotee Who Paid a Check For Rs 100 Crore: సింహాచలం శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమం బుధవారం సింహగిరిపై ఈవో త్రినాథరావు పర్యవేక్షణలో జరిగింది. లెక్కింపు కొనసాగుతుండగా.. హుండీలో రూ.100 కోట్ల చెక్కు కలకలం రేపింది. సింహాద్రి అప్పన్న హుండీ లెక్కింపులో సమయంలో ఓ భక్తుడు వేసిన రూ.100 కోట్ల చెక్కు కనిపించింది. బొడ్డేపల్లి రాధాకృష్ణ పేరుతో ఉన్న ఆ చెక్కును సిబ్బంది గుర్తించారు. దానిపై శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామి వారి దేవస్థానం అని ఆంగ్లంలో రాసి ఉంది. తేదీ లేకుండా ఉన్న ఈ చెక్కుపై నగదు మొత్తం రాయాల్సిన చోట ముందుగా రూ.10 రాసి కొట్టేసి.. దాని పక్కనే రూ. వంద కోట్లు అంకెల్లో వేశారు. ఇది ఎంవీపీ కాలనీ కొటక్ మహీంద్ర బ్యాంకుకు చెందినది కావడంతో.. నిర్ధారణ కోసం దేవస్థానం అధికారులు సంబంధిత బ్యాంకును సంప్రదించారు. ఆ ఖాతాలో కేవలం రూ.17 నిల్వ ఉన్నట్లు తెలుసుకుని అవాక్కయ్యారు. ఎవరో ఉద్దేశపూర్వకంగా ఇలా చేసి ఉండవచ్చని.. లేదా దొరికిన చెక్కును ఇలా హుండీలో వేసి ఉండొచ్చని భావిస్తున్నారు. భక్తులు కానుకల రూపంలో సమర్పించిన నగదు రూ.1.79 కోట్ల నగదు రూపంలో వచ్చినట్లు ఈవో తెలిపారు. దీంతో పాటు 79.98 గ్రాములు బంగారం, 10 కిలోల వెండి కానుకల రూపంలో వచ్చినట్లు తెలిపారు. ఈ మొత్తం ఆదాయం 16 రోజులదిగా తెలియజేశారు.