దొంగతనం కేసులో కోటి రూపాయిల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 13, 2024, 6:24 PM IST
Police Arrested Nine Accused In Robbery Case: కూటి కోసం కోటి కష్టాలంటారు. ఆ జీవనం కోసం రోజూవారి కూలీగా బంగారు దుకాణంలో చేరాడో ఓ వ్యక్తి. రోజూ వారి కూలీని అనే విషయం విషయం మర్చిపోయి జల్సాల కోసం స్థోమతకు మించి అప్పులు చేశాడు. అప్పు చేస్తే సరిపోతుందా తీసుకున్నది తిరిగి చెల్లించాలి కదా. అది ఈ వ్యక్తి వల్ల కాలేదు. చేసిన అప్పులు తీర్చటం కోసం దొంగతనాలకు పాల్పడ్డాడు. బంగారు దుకాణంలో పనిచేసేవాడు కనుక స్థానిక బంగారు వ్యాపారుల సమాచారం పక్కగా ఉంది. దీంతో వ్యాపారులను టార్గెట్ చేసి ముఠాగా ఏర్పడి వరుస చోరీలకు ప్రణాళికలు సిద్దం చేసుకున్నాడు. అనుకున్నట్లే పథకాన్ని వందశాతం అమలు చేశాడు. కాని నేరం చేసినవారు ఏదో సాక్ష్యం వదిలేస్తారన్న చందాన చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వారం రోజుల క్రితం జరిగిన దారి దోపిడీ కేసులో మొత్తం తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి కోటి రూపాయిల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల ఆరో తేదీ రాత్రి బంగారు వ్యాపారి కోటేశ్వరరావు బైక్పై ఇంటికి వెళ్తున్నారు. మినీ బైపాస్ రోడ్డు వద్దకు చేరుకునే సరికి నిందితులు కోటేశ్వరరావు నగల సంచిని లాక్కెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతికత ఆధారంగా కేసు ఛేదించారు.
తిరుపతి జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు, తిరుపాల్, నాగేంద్రబాబు, సుబ్రహ్మణ్యం, జగదీష్, నరేంద్ర, పాపయ్య, మన్దీప, వంశీలను ఈ ఘటనలో పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 1758 గ్రాముల బంగారం, 2.30 లక్షల నగదు, మారుతి కారు, రెండు బైకులు, అయిదు సెల్ ఫోన్లను వీరి నుంచి స్వాధీనం చేసుకున్నారు. గూడూరులో నివాసముంటున్న వెంకటేశ్వర్లు బంగారు దుకాణాల్లో పనిచేస్తూ, అప్పుల పాలవటంతో చోరీలకు పాల్పడుతున్నారని జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి తెలిపారు. బంధువు తిరుపాల్తో కలిసి కొంతమంది చైన్ స్నాచర్లను ఎంపిక చేసుకుని పక్కా పథకంతో బంగారు ఆభరణాల సంచిని లాక్కెళ్లారని ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి తెలిపారు.