Lokesh Padayatra in Nandyala: రాయలసీమకు సీఎం జగన్ శాపం: లోకేశ్
Lokesh Padayatra in Nandyala: అప్పర్ భద్ర ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రయత్నించని సీఎం జగన్... రాయలసీమకు శాపమనితెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 102వ రోజు నంద్యాల నియోజకవర్గంలో కొనసాగింది. నియోజకవర్గంలోని ప్రజలతో మాట్లాడుతూ.. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నాడు. నంద్యాలలోని టీడీపీ శ్రేణులు లోకేశ్కు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ చేస్తున్న అక్రమాలను ఎండగట్టాడు.
జగన్ అరాచకాలు చూసి తల్లి, చెల్లి సైతం దూరంగా వెళ్లారని, అందుకే ఒంటరయ్యారని లోకేశ్ ఎద్దేవా చేశారు. తెలుగుదేశం హయాంలోనే నంద్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామన్న లోకేశ్....ఈ నాలుగేళ్ల కాలంలో 10 శాతం పనులు కూడా చేయలేదని విమర్శించారు. సండే ఎమ్మెల్యే పాలనలో నంద్యాలలో నేరాలు బాగా పెరిగాయని.. కానిస్టేబుల్ సురేంద్రను వైసీపీ నేతలు కిరాతకంగా చంపారని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక సురేంద్రను చంపినవారిని జైలుకు పంపిస్తామని తెలిపారు. అలాగే రైతులకు చెందిన 3,500 ఎకరాల్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్ పెడతారా? ఎమ్మెల్యే, ఎంపీ భూములు మాత్రం తీసుకోరా? అని లోకేశ్ ప్రశ్నించారు.