Santhabommali Boy Organ Donation : కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం. ఈ రెండింటి మధ్యే మనిషి జీవితం అని వింటూనే ఉంటాం. పుట్టడం, గిట్టడం ఏ ఒక్కరి చేతిలో ఉండేవి కావు. కానీ మరణశయ్యపై ఉంటూ మరో నలుగురికి అవయవాలను ప్రసాదించడం ఒక గొప్ప కార్యంగా చెప్పవచ్చు. మట్టిలో కలిసే అవయవాలు మరో మనిషి శరీరంలోకి వెళ్లి అవి నిత్య చేతనంగా నిలుస్తాయి. ఇది గ్రహించిన కొందరు తమవారు మరణించినా పరుల మేలు ఆలోచించి పునర్జన్మను ప్రసాదిస్తున్నారు.
తాజాగా ఆట పాటలతో అల్లరి చేష్టలతో సందడి చేసే ఆ బాలుడు అందనంత దూరాలకు వెళ్లిపోయాడు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు ఇక లేడని తెలిసి ఆ కన్నోళ్లు గుండెలవిసేలా రోదించారు. ఆ బాధను దిగమింగుకొని అవయవదానానికి అంగీకరించారు. పుట్టెడు దుఃఖంలోనూ తమ బిడ్డ మరో ఐదుగురికి పునర్జన్మ ప్రసాదిస్తే చాలంటూ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ హృదయ విదారక ఘటన శ్రీకాకుళంలోని జిల్లాలో చోటు చేసుకుంది.
దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సంతబొమ్మాళి మండలం కాపుగోదాయవలస గ్రామానికి చెందిన వాతాడ చిరంజీవులు, రోజా దంపతులకు ఇద్దరు కుమారులు. ఆరో తరగతి చదువుతున్న చిన్న కుమారుడు యువంత్ పుట్టినరోజు వేడుకలు గత నెల జనవరి 29న నిర్వహించారు. ఆ మరుసటి రోజు కళ్లు తిరిగి పడిపోయాడు. కుటుంబ సభ్యులు చిన్న సమస్యగా భావించి స్థానిక వైద్యుడిని సంప్రదించారు. ప్రాథమిక చికిత్స చేసినా తగ్గలేదు.
Organ Donation in Srikakulam : శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించినా ఫలితం లేదు. అనంతరం విశాఖలోని కేజీహెచ్కు తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షలు చేసి బాలుడు గులియన్ బ్యారీ సిండ్రోమ్తో బాధపడుతున్నట్లు గుర్తించి చికిత్స అందించి పంపించారు. మళ్లీ ఆరోగ్యం బాగాలేకపోవడంతో రాగోలు జెమ్స్ ఆసుపత్రికి ఈనెల 4న తీసుకొచ్చారు. అక్కడ వైద్యులు శ్రమించినా ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. దీంతో వైద్యుల బృందం యువంత్ బ్రెయిన్ డెడ్గా ప్రకటించారు.
వైద్యులు బాలుడి పరిస్థితిని తల్లిదండ్రులకు వివరించారు. ఈ క్రమంలో అవయవదానంపై వారికి అవగాహన కల్పించారు. పుట్టెడు శోకంలోనూ తమ బిడ్డ మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపితే చాలని భావించి ఇందుకు ముందుకొచ్చారు. వెంటనే జీవన్దాన్ రాష్ట్ర సమన్వయకర్తకు తెలపగా వారు ఏర్పాట్లు చేశారు. సోమవారం చిన్నారి మూత్రపిండాలు, కాలేయాన్ని సేకరించారు. వాటిని జీవన్దాన్ ప్రొటోకాల్ ప్రకారం ముగ్గురికి కేటాయించారు.
గ్రీన్ ఛానల్ ద్వారా ఒక మూత్రపిండం, కాలేయాన్ని విశాఖకు, మరో మూత్రపిండాన్ని శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. రెడ్క్రాస్ ఆధ్వర్యంలో రెండు నేత్రాల నుంచి కార్నియాలు సేకరించారు. అవయవదానానికి ముందుకొచ్చిన బాలుడి తల్లిదండ్రులను అభినందించి ధ్రువపత్రం అందజేశారు. మృతదేహానికి ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు ఘన నివాళులర్పించారు. జెమ్స్ ఆసుపత్రి డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హేమంత్, జీఎం డాక్టర్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ జ్యోత్స్న పాల్గొన్నారు.
తల్లిదండ్రుల నిర్ణయం ఆదర్శనీయం: శ్రీకాకుళం జిల్లా కాపుగోదాయవలసలో ఆరో తరగతి చదువుతున్న పదేళ్ల యువంత్ అకాలమరణం అత్యంత బాధాకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అయితే అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు పుట్టినరోజే బ్రెయిన్ డెడ్కు గురైతే, పుట్టెడు దుఃఖంలో ఉండి కూడా బాలుడి అవయవదానానికి అంగీకరించిన ఆ తల్లిదండ్రుల మానవతా దృక్పథం, సామాజిక బాధ్యత, మనోనిబ్బరం ఆదర్శనీయమని ప్రశంసించారు. ఆ కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ ప్రభుత్వం వారికి అన్నివిధాలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
శ్రీకాకుళం జిల్లా కాపుగోదాయవలసలో ఆరో తరగతి చదువుతున్న పదేళ్ళ యువంత్ అకాలమరణం అత్యంత బాధాకరం. అయితే అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు పుట్టినరోజే బ్రెయిన్ డెడ్ కు గురైతే... పుట్టెడు దుఃఖంలో ఉండి కూడా బాలుడి అవయవదానానికి అంగీకరించిన ఆ తల్లిదండ్రుల మానవతా దృక్పథం, సామాజిక బాధ్యత,… pic.twitter.com/oQQ5PfhVvG
— N Chandrababu Naidu (@ncbn) February 11, 2025
Organ Donation in VIMS: జీవన్మృతుడిగా యువకుడు.. చనిపోతూ మరో ఐదుగురికి వెలుగులు