రైతుల పాలిట శాపంగా మారిన వాగు - ఏళ్ల తరబడి మరమ్మత్తులు లేకపోవడంతో పొలాల్లోకి నీళ్లు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 9, 2023, 5:10 PM IST

thumbnail

Fields are Flooded by Flow of Kuchiwagu: ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలంలో ఉన్న కూచివాగు రైతుల పాలిట శాపంగా మారింది. ఏళ్లుగా వాగు మరమ్మత్తులపై అధికారులు నిర్లక్ష్యం వహించటంతో వరద పోటెత్తి వేల ఎకరాలు ముంపుకు గురవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలు కురిసినప్పుడు వాగులో ప్రవహించాల్సిన వరద నీరు సమీప పొలాలోకి పోటెత్తడంతో వేల ఎకరాలు నీట మునుగుతున్నాయని రైతులు చెబుతున్నారు.

పెనుగంచిప్రోలు మండలంలో ఉన్న కూచివాగు గత 10సంవత్సరాలుగా మరమ్మత్తులకు నోచుకోక పంటలు దెబ్బతింటున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ముచ్చింతాల,అనిగండ్లపాడు, గుమ్మడిదూరు, వెల్దుర్తిపాడు గ్రామాల్లోని వేల ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు.  చిన్నచిన్న వర్షాలకే వాగు పొంగడంతో పంట చేలు ముంపుకు గురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురిసిన ప్రతిసారి ఇదే పరిస్థితి కొనసాగడంతో  వేల రూపాయిలు నష్టం వస్తుందని అన్నదాతలు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఈ వాగులో చెత్త అడ్డుపడడంతో దిగువకు నీరు పారే అవకాశం లేక వరద నీరు పోటెత్తుతుంది. కూచివాగుకు ప్రోక్లెయినర్​తో మరమ్మత్తులు నిర్వహించి,వంతెన నిర్మాణం చేపడితే రైతులకు మేలు జరుగుతుందని రైతులు చెబుతున్నారు. ఈ విషయమై అధికారులకు చెబుతున్నా స్పందించడం లేదని, ప్రభుత్వం  రైతుల కష్టాలను అర్థం చేసుకుని తగిన న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. తాజాగా మిగ్​జాం తుఫాను ప్రభావంతో  కురిసిన భారీ వర్షానికి వాగులో వరద పోటెత్తి సుమారు 2వేల ఎకరాల్లో వరి పంట పూర్తిగా వరద ముంపుకు గురైందని తెలిపారు. దీనివల్ల ఎకరానికి రూ.50 వేలు నష్టం వచ్చిందన్నారు. వాగు పోటెత్తడం వల్ల ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు నీటిపాలు అవుతున్నాయని ఆందోళన చెందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.