అక్రమ కేసుల నిజానిర్ధారణకు త్రిసభ్య కమిటీ - పాదర్శక ఎన్నికలే లక్ష్యంగా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అడుగులు - సీఎఫ్డీ కార్యవర్గ సమావేశం
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 9, 2023, 4:57 PM IST
|Updated : Dec 9, 2023, 7:42 PM IST
Citizens for Democracy Three Member Body: రాష్ట్రంలో రాజకీయ పార్టీల, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలపై పోలీసు కేసులపై వాస్తవాల నిజనిర్ధారణకు త్రిసభ్య సంఘాన్ని ఏర్పాటు చేస్తూ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ నిర్ణయం తీసుకుంది. సీఎఫ్డీ అధ్యక్షులు, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జి. భవానీ ప్రసాద్ అధ్యక్షతన తిరుపతిలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల కార్యకర్తలపై ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమ కేసులు పెడుతున్న ఘటనలపై నిజనిర్ధారణకు కమిటీ ఏర్పాటు చేసినట్లు సీఎఫ్డీ ప్రతినిధులు ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. రాష్ట్రంలో చట్టబద్ధ పాలన, నిష్పాక్షిక స్వేచ్ఛాయుత , పారదర్శక ఎన్నికలు జరగడానికి వీలుగా తమవంతు కృషి చేస్తున్నామని వివరించారు. అందులో భాగంగానే పోలీసు అక్రమ కేసుల అంశంపై తాము దృష్టి సారించినట్లు తెలిపారు. గత కొద్ది నెలలుగా రాష్ట్రంలో ప్రతిపక్ష రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలపై పోలీసులు నమోదు చేసిన కేసుల స్వరూప స్వభావాలను పరిశీలించడానికి వివిధ రంగాలలో సుప్రసిద్ధులైన వారితో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డీజీపీగా పని చేసిన ఐపీఎస్ అధికారి ఎం. వి. భాస్కరరావు, ఏపీ పూర్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ అనగాని సత్యప్రసాద్, హిందూ దినపత్రిక పూర్వ రెసిడెంట్ ఎడిటర్ వెంకటేశ్వర్లు కమిటీలో సభ్యులుగా ఉన్నారని తెలిపారు. ఈ నెల 13న విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని సీఎఫ్డీ కార్యవర్గ సమావేశం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.