ఉత్తుత్తి కార్పొరేషన్లు ఇచ్చి బీసీలను జగన్ మోసం చేశారు: టీడీపీ నేత శ్రీనివాస్ రెడ్డి - AP Latest News
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 3, 2023, 8:11 PM IST
BC Atmiya Sabha in kadapa District : తెలుగు దేశం పార్టీలో ఎన్టీ రామారావు నుంచి నేటి చంద్రబాబు నాయుడు వరకు బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కడపలో నిర్వహించిన బీసీల ఆత్మీయ సమావేశంలో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, టీడీపీ హయాంలోనే బీసీలకు ఎక్కువగా పదవులను కేటాయించి, బీసీల అభ్యున్నతికి ఎంతో కృషి చేశామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం బీసీలకు ఉత్తుత్తి కార్పొరేషన్లు ఇచ్చి, వారు మాత్రం పెద్దపెద్ద పదవులు అలంకరించి వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని చెప్పారు. బీసీలకు ఎలాంటి ప్రయోజనం లేని కార్పొరేషన్ పదవులు కేటాయించటం వల్ల ప్రజలకు కూడా ఎలాంటి సేవ చేయలేక పోతున్నారని తెలిపారు.
అలాంటి పదవులు ఉన్నా లేకపోయినా ఎలాంటి ప్రయోజనం లేదని విమర్శించారు. బీసీలకు టీడీపీ హయాంలోనే ఎంతో ప్రాధాన్యత కలిగిన పదవులను కేటాయించామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే బీసీలకు ప్రముఖమైన పదవులను కేటాయిస్తామన్నారు. సమావేశానికి బీసీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వీరంతా వచ్చే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కష్టపడి పని చేస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు.