కడప జిల్లాలోని రాయచోటి, సంబేపల్లి, చిన్నమండెం, సుండుపల్లి, గాలివీడు మండలాలతో పాటు చిత్తూరు జిల్లాలోని గుర్రంకొండ, కలకడ, కలికిరి, గొట్టిగళ్లు, భాకరాపేట వంటి ప్రాంతాల్లో వేల సంఖ్యలో నర్సరీలు ఉన్నాయి. లాక్డౌన్ కారణంగా నాలుగు నెలల నుంచి మొక్కల విక్రయాలు లేకపోవడం వల్ల నర్సరీల్లోనే పెరిగిపోతున్నాయని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని ఎవరూ కొనుగోలు చేయకపోవడం వల్ల నష్టం చవిచూడాల్సి వస్తోందని వాపోతున్నారు.
వర్షం వస్తేనే కొనుగోళ్లు...
కడప జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెలలు గడుస్తున్నా నేటికీ సరైన వర్షపాతం నమోదవలేదు. చిత్తూరు జిల్లాలో మదనపల్లి, తంబళ్లపల్లి, పుంగనూరు, వాయల్పాడు, పీలేరు నియోజకవర్గాల్లో అత్యల్ప వర్షపాతం నమోదైంది. ఈ క్రమంలో తోటల సాగుకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఫలితంగా రైతులు మొక్కలను కొనుగోలు చేయటం లేదు.
ఉపాధి పైనే నమ్మకం...
ఉద్యాన తోటల సాగుకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకం ఉపాధి హామీ పథకం ద్వారా లభిస్తోంది. మామిడి, చినీ, దానిమ్మ, కొబ్బరి, నేరేడు, జామ వంటి తోటలు సాగు చేసుకునే వారు.. మీ సేవ కేంద్రాల ద్వారా భూమి వివరాలతో పేర్లు నమోదు చేసుకుంటే మొక్కల పెంపకానికి నిధులు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు దరఖాస్తు చేసుకుని నిధుల కోసం ఎదురు చూస్తున్నారు.
భారీగా నిర్వహణ ఖర్చులు...
నర్సరీల నిర్వహణకు.. స్థలం, నీటి వసతి, కలుపు నివారణ, ఎరువులు, కూలీల అవసరం ఎక్కువగా ఉంటుంది. వీటన్నింటితో కలుపుకుని ఒక్కో నర్సరీ నిర్వహణకు రూ. 10 నుంచి రూ.50 లక్షలు ఖర్చు అవుతుందని నిర్వాహకులు తెలిపారు.
కడప జిల్లాలో సుమారు 13 లక్షల మొక్కలను నాటాలి అనేది లక్ష్యం కాగా.. ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదు. నర్సరీలలోని ఉద్యాన మొక్కలను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసి.. రైతులకు సరఫరా చేస్తే బాగుంటుందని ఉద్యాన శాఖ నిపుణులు అంటున్నారు.
ఇదీ చదవండి..
'ఎస్పీవై పరిశ్రమ గ్యాస్ లీక్ మృతుడి కుటుంబానికి కోటి పరిహారం ఇవ్వాలి'