నరేశ్.. శభాష్..!
తల్లిదండ్రులు శేఖర్రెడ్డి, అనసూయమ్మతో ఈతోటి నరేశ్రెడ్డి
కడప జిల్లా గాలివీడు మండలం ఈతోటివాండ్లపల్లికి చెందిన ఈతోటిి నరేశ్రెడ్డి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (ఈఈఈ) విభాగంలో రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించాడు. మొత్తం 175 మార్కులతో ప్రథమ స్థానం కైవసం చేసుకుని సత్తా చాటాడు. నరేశ్ తండ్రి శేఖర్రెడ్డి రైతు కాగా, తల్లి అనసూయమ్మ గృహిణి, చెల్లెలు స్వాతి డిప్లొమా చదువుతోంది. నరేశ్రెడ్డి పదోతరగతి వరకు గాలివీడులోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదివి 10కి 10 జీపీఏ పాయింట్లు సాధించాడు. అనంతరం పాలిసెట్లో 542 ర్యాంకు సాధించి రాయచోటిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చేరాడు. పట్టుదలతో చదివి 99 శాతంతో ఉత్తీర్ణత సాధించాడు. తిరుపతి పట్టణంలోని ఓ శిక్షణ కేంద్రంలో స్వల్ప వ్యవధి శిక్షణ తీసుకున్నాడు. అనేక పోటీ పరీక్షల్లో పాల్గొని పట్టుదలతో రాత్రింబవళ్లు చదివాడు.
సివిల్స్ సాధనపైనే గురి
ఆంధ్రా విశ్వవిద్యాలయంలో బీటెక్ పూర్తి చేస్తాను. సివిల్స్ సాధనే లక్ష్యంగా చదువు సాగిస్తాను. నాకు లోక్సత్తా పార్టీ నేత జయ ప్రకాశ్ నారాయణ స్ఫూర్తి. రాష్ట్రస్థాయిలో ర్యాంకు సాధించడం సంతోషంగా ఉంది. - ఈతోటి నరేశ్రెడ్డి
విద్యాసుగంధం... సుధ
స్నేహ సుధను అభినందిస్తున్న తల్లిదండ్రులు
ప్రొద్దుటూరు విద్య, న్యూస్టుడే: ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీకి చెందిన రామాయణం స్నేహసుధ.5వ ర్యాంకు సాధించింది. ఈమె తండ్రి మధుసూదనరావు ఆర్టీసీలో అకౌంటెంట్గా పనిచేస్తుండగా.., తల్లి విజయలక్ష్మి గృహిణి. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుకుంది. పదోతరగతిలో 9.5 జీపీఏ పాయింట్లు సాధించింది. అనంతరం డిప్లొమా కోర్సు చేసేందుకు పాలిసెట్ పరీక్షకు హాజరై ఉత్తమ ర్యాంకు దక్కించుకుంది. పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈఈఈ విభాగంలో సీటు సంపాదించి 96 శాతం మార్కులతో విజయవంతంగా కోర్సు పూర్తి చేసింది. తెలంగాణ ఈసెట్లోనూ 9వ ర్యాంకు దక్కించుకుంది.
ఆచార్యురాలు కావాలన్నదే ఆశ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈసెట్ ఫలితాల్లో మంచి ర్యాంకులు వచ్చినందుకు సంతోషంగా ఉంది. నన్ను తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సహించారు. కళాశాల అధ్యాపకుల సహకారం మరువలేనిది. వారి వల్లే నేను ఉత్తమ ర్యాంకులు సాధించాను. ప్రతి విద్యార్థి లక్ష్యం ఏర్పర్చుకుని ఏకాగ్రతతో చదివితే అనుకున్న గమ్యాన్ని చేరుకోవచ్ఛు బీటెక్, ఎంటెక్ పూర్తి చేస్తాను. అనంతరం పీహెచ్డీ చేసి ఆచార్యురాలు కావాలన్నదే నా ఆశ. - స్నేహసుధ
రైతు ఇంట... చదువుల పంట
తల్లిదండ్రులతో సుబ్రహ్మణ్యం
సిద్దవరం గ్రామానికి చెందిన కుర్రా సుబ్రహ్మణ్యం నాలుగో ర్యాంకు సాధించాడు. తండ్రి చిన్నసుబ్బయ్య రైతు కాగా, తల్లి లక్ష్మిదేవి గృహిణి. స్వగ్రామంలోనే పదోతరగతి చదివి 9.3 జీపీఏ పాయింట్లు సాధించాడు. తిరుపతి ఎస్.వి. పాలిటెక్నిక్ కళాశాలలో చదివాడు. మా ఒక్కగానొక్క కుమారుడి బంగారు భవిషత్తు కోసం ఎంతైనా ఖర్చు పెడతామని తల్లిదండ్రులు తెలిపారు. మంచి ఉద్యోగం సాధించాలని ఆకాంక్షిస్తున్నామన్నారు.
సాధించాలనే సంకల్పం ఉండాలి
ఏదైనా సాధించాలనే సంకల్పం ఉంటే కచ్చితంగా సాధిస్తారు. తిరుపతిలో ఓ ప్రైవేటు శిక్షణ సంస్థలో శిక్షణ తీసుకున్నాను. దీంతోపాటు ఇంటి వద్ద చదవడంతో నాలుగో ర్యాంకు సాధించగలిగాను. పట్టుదలతో చదివితే సాధించలేనిది ఏమి లేదు. ప్రతి అంశాన్ని అర్థం చేసుకొని చదవడంతోనే ఉపయోగం ఉంటుంది. తల్లిదండ్రులు నిరక్ష్యరాస్యులైనా నా కోసం కష్టపడుతున్నారు. వారి కష్టాన్ని చూస్తున్నాను. - సుబ్రహ్మణ్యం
హర్షవర్ధన్.. సత్తా చాటెన్..!
కుమారుడు హర్షవర్ధన్కు మిఠాయి తినిపిస్తున్న జయరామిరెడ్డి, లక్ష్మీదేవి
సంబేపల్లె మండలం దుద్యాల పంచాయతీ చిన్నకోడివాండ్లపల్లెకు చెందిన హర్షవర్ధన్రెడ్డి అగ్రికల్చర్ డిప్లొమా ఇంజినీరింగ్ విభాగంలో 3వ ర్యాంకు సాధించాడు. 1 నుంచి 10వ తరగతి వరకు రాయచోటిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదివాడు. 10వ తరగతిలో 9.7 జీపీఏ పాయింట్లు సాధించాడు. అనంతరం చిత్తూరు జిల్లా కలికిరిలో అగ్రికల్చర్ డిప్లొమా ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. తండ్రి జయరామిరెడ్డి వ్యవసాయం చేస్తుండగా.. తల్లి లక్ష్మిదేవి గృహిణి.
కష్టానికి తగ్గ ఫలితం దక్కింది
ప్రతిరోజూ 6 నుంచి 10 గంటల వరకు చదివాను. నేను పడిన కష్టానికి ఫలితం దక్కింది. తల్లిదండ్రులు, అధ్యాపకులు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. - హర్షవర్ధన్రెడ్డి
తిరుమలవాసు.. అదుర్స్
కుమారుడు తిరుమలవాసుకు మిఠాయి తినిపిస్తున్న తల్లిదండ్రులు
మైలవరం మండలం వేపరాలకు చెందిన కె.వెంకటతిరుమలవాసు 4వ ర్యాంకు సాధించాడు. నేతన్న కుటుంబంలో జన్మించిన వాసు చిన్నప్పటి నుంచి చదువులో ముందుండే వాడు. పదోతరగతి వరకు స్థానిక ప్రభుత్వ జడ్పీ పాఠశాలలో చదివి 9.2 జీపీఏ పాయింట్లు సాధించాడు. తల్లిదండ్రులు తిరుమలదాసు, అరుణలు మగ్గం నేస్తూ తమ ముగ్గురు పిల్లలను చదివిస్తున్నారు.
ఉన్నతోద్యోగం సాధిస్తా
చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల కష్టాన్ని చూస్తూ పెరిగాను. మగ్గం నేస్తూ ముగ్గురిని చదివిస్తున్నారు. అమ్మానాన్నలు పడుతున్న కష్టాలు మేము పడకూడదని మాకు వెన్నుతట్టి బాగా చదువుకోవాలని ప్రోత్సహిస్తున్నారు. వారి ఇష్టం మేరకు తిరుపతిలో శిక్షణ తీసుకుని పరీక్షకు సిద్ధమయ్యా. మంచి ర్యాంకు రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఉన్నతోద్యోగం సాధించి తల్లిదండ్రుల కష్టాలు తీరుస్తాను. - వెంకట తిరుమలవాసు
వ్యవసాయ కుటుంబంలో భానూదయం
భాను ప్రకాష్రెడ్డి
వ్యవసాయ కూలీగా జీవిస్తూ కుటుంబాన్ని పోషించుకొంటున్న ఓ కుటుంబంలో చదువుల పంట పండింది. స్థానిక ఎన్జీవో కాలనీకి చెందిన రామకృష్ణారెడ్డి, అమరావతిల కుమారుడు భాను ప్రకాష్రెడ్డి 20వ ర్యాంకు సాధించి ప్రతిభను కనబరిచారు. రాయచోటి పట్టణం మాసాపేటలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నారు. ఈసీఈ విభాగంలో రాష్ట్రంలో 20వ ర్యాంకును సొంతం చేసుకోవడంపై కళాశాల ప్రిన్సిపల్ డాక్టరు పి.కె.ప్రకాష్రెడ్డి, అధ్యాపకులు అభినందించారు. పేద కుటుంబంలో చదువుల ఆణిముత్యం వెలుగు చూసిందన్నారు.
జిల్లాకు రెండో స్థానం
ఈసెట్ ఫలితాల్లో జిల్లా రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంగళవారం విడుదల చేసిన ఫలితాల్లో కడప జిల్లా అభ్యర్థులు 97.23 శాతం ఉత్తీర్ణతతో రెండో స్థానం సాధించారు. ఇందులో అమ్మాయిలు 95.83 శాతం ఉత్తీర్ణత సాధిస్తే, అబ్బాయిలు 98.63 శాతంతో పైచేయి సాధించారు. జిల్లా వ్యాప్తంగా 2,117 మంది ఈసెట్ పరీక్షకు హాజరుకాగా 2,043 మంది అర్హత సాధించారు.
తెలంగాణ ఎంసెట్లోనూ సత్తా
ప్రొద్దుటూరు పట్టణంలోని బుడ్డాయపల్లెకు చెందిన గంగుల భువన్రెడ్డి మంగళవారం విడుదలైన తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లోనూ ప్రతిభ కనబరిచారు. తెలంగాణ రాష్ట్ర స్థాయిలో 14వ ర్యాంకు సాధించాడని తండ్రి గంగుల ప్రభాకర్రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు అభినందించారు. తాజాగా విడుదలైన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 2వ ర్యాంకు సాధించడం విశేషం.
ఇదీచదవండి