కొవిడ్-19 సంక్లిష్ట సమయంలో ప్రజలు రహదారి ప్రమాదాలకు గురైనా... మహిళల ప్రసవ సమయం, తలసేమియా పిల్లలు, క్యాన్సర్ బాధితులు, గుండె శస్త్రచికిత్సలు, డయాలసిస్ రోగులు.. ఇలా చాలామందికి రక్తం అవసరం అవుతోంది. కరోనా సమయంలో రక్తదానం చేయడానికి చాలామంది ముందుకు రావడం లేదు. ఎందుకంటే సాప్ట్ వేర్ కంపెనీలు ఉద్యోగస్తులకు వర్క్ ఫ్రం హోం ప్రకటించడం, కళాశాలలు మూతపడటం వంటి పరిస్థితులు ఎదురయ్యాయి.
యువత ఎక్కువగా రక్తదానం చేయడానికి ముందుకు వస్తుంటారు. కానీ కరోనా సమయంలో అది సక్రమంగా జరగడం లేదు. రక్తనిధి కేంద్రాల్లో రక్తం నిల్వలు నిండుకున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలను చైతన్యం చేయాలనే తలంపు మదిలో మెదిలిన మరుక్షణమే కడపకు చెందిన యువకుడు పవన్ కుమార్ కార్యాచరణకు దిగాడు. 13 ఏళ్ల కిందట బ్లడ్-2 లివ్ స్వచ్ఛంద సంస్థను స్థాపించి కడప జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు విరివిగా నిర్వహిస్తున్నాడు. ప్రస్తుత సమయంలో జిల్లాలో మాత్రమే అవగాహన కల్పించడం మంచిది కాదని భావించి... రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలను చైతన్యం చేయాలని సంకల్పించాడు.
సెప్టెంబరు 10వ తేదీ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు తిరుగుతూ రక్తదానంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. సెప్టెంబరు 10వ తేదీ కాకినాడ నుంచి తన రక్తదాన చైతన్యయాత్రను ప్రారంభించిన పవన్ కుమార్... తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతూనే ఉన్నాడు. ఆయా జిల్లాల్లోని రక్తనిధి కేంద్రాల వారికి సమాచారం అందించి... ప్రధాన కూడలిలో చిన్న టెంటు లేదంటే... మైకు తీసుకుని వీధుల్లో తిరుగుతూ రక్తదానంపై ప్రచారం చేస్తున్నాడు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు నిర్విరామంగా రక్తదానంపై తనకున్న 13 ఏళ్ల అనుభవాన్ని ప్రజలకు వివరిస్తున్నాడు ఈ యువకుడు.
సెప్టెంబరు 10,11 తేదీల్లో కాకినాడలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ప్రజలను చైతన్యపరచడమే కాకుండా 50 మందితో రక్తదానం చేయించాడు. విరివిగా కరపత్రాలు పంపిణీ చేసి అవగాహన కల్పించాడు. సెప్టెంబరు 13వ తేదీ విశాఖపట్నంలో రక్తదానంపై అవగాహన కల్పించి 16 మందితో రక్తదానం చేయించాడు. ఇక్కడ రోడ్డుపైనే ప్రచారం చేశాడు. సెప్టెంబరు 14,15 తేదీల్లో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఉదయం నుంచి రాత్రి వరకు మైకులో ప్రచారం చేసి... అక్కడికి వచ్చిన యువత చేత రక్తదానం చేయించాడు. సెప్టెంబరు 16,17,18 తేదీల్లో మూడు రోజుల పాటు విజయవాడలో పర్యటించి ప్రజలను చైతన్యం చేశాడు. ఇక్కడ 50 మందితో రక్తదానం చేయించాడు. మైకులో తాను చెబుతున్న ప్రసంగాన్ని వింటున్న ప్రజల చేతనే ఒప్పించి రక్తం ఇచ్చేలా చేస్తున్నాడు.
సెప్టెంబరు 29, 30, అక్టోబరు 1, 2 తేదీల్లో వరసగా హైదరాబాద్ నగరంలో రక్తదానంపై ప్రజలకు అవగాహన కల్పించాడు. నిజాంపేట్, అమీర్ పేట, మాదాపూర్, మదీనగూడ ప్రాంతాల్లో ప్రజలను చైతన్యం చేస్తూనే దాదాపు నాలుగు రోజుల్లో 150 మందితో రక్తదానం చేయించాడు. అక్టోబరు 9వ తేదీ సిద్దిపేట జిల్లాలో ప్రచారం చేసి 15 మందితో రక్తదానం చేయించాడు. అక్టోబరు 12వ తేదీ వరంగల్ జల్లాలో 11 మందితో రక్తదానం చేయించాడు. 20 రోజులకోసారి కడపకు వచ్చి రెండు రోజుల పాటు ఇక్కడే ఉండి... తిరిగి జిల్లాలకు వెళ్తున్నాడు. ప్రస్తుతం పవన్ కుమార్ హైదరాబాద్ నగరంలోనే పర్యటిస్తూ ప్రజలను చైతన్యం చేస్తున్నాడు. ఈ నెలరోజుల్లోనే దాదాపు 500 యూనిట్ల రక్తం సేకరించాడు పవన్ కుమార్. వాటిని రక్తనిధి కేంద్రాలకు అందిస్తున్నాడు.
కడప నగరంలోని కొందరు మిత్రుల సహకారం, కుటుంబ ప్రోత్సాహంతో ఎవ్వరినీ ఆశించకుండా స్వచ్ఛందంగా జిల్లాలు తిరుగుతూ రక్తదానంపై అవగాహన కల్పిస్తున్నాడు. రవాణ ఖర్చులకు కొందరు మిత్రులు చేదోడుగా ఉంటున్నారు. ఇప్పటివరకు 21 సార్లు రక్తదానం చేసిన పవన్ కుమార్... ప్రజలను రక్తదానం చేయాలని ప్రోత్సహిస్తున్నాడు. ఇప్పటివరకు ఎన్నో అవార్డులు కూడా సొంతం చేసుకున్నాడు పవన్ కుమార్. రక్తదానంపై ఇప్పటివరకు 13 లక్షల కరపత్రాలు, 5 వేల పుస్తకాలు, క్యాలెండర్లు పంపిణీ చేశాడు. ఆరోగ్యవంతుడైన వ్యక్తి ప్రతి 3 నెలలకోసారి రక్తం ఇవ్వొచ్చని అంటున్నాడు. కరోనా సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో తిరగాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెబుతున్నాడు. ఇతను స్వచ్ఛందంగా చేస్తున్న సేవకు కుటుంబం నుంచి ప్రోత్సాహం ఉంటోంది. తన భర్త చేస్తున్న మంచిపనికి కష్టమైనా సరే ప్రజలకు సేవ చేస్తున్నారనే ఉద్దేశంతో అండగా ఉంటున్నామని పవన్ కుమార్ భార్య ఆశాజ్యోతి అంటున్నారు.
13 ఏళ్ల కిందట తన తల్లికి వెన్నెముక ఆపరేషన్ సందర్భంగా రక్తం లభించక ఇబ్బంది పడిన పరిస్థితులను కళ్లారా చూసిన పవన్ కుమార్... భార్య గుండె శస్త్రచికిత్స సమయంలో రక్తం కొరతను ఎదుర్కొన్న సందర్భాలను చూశాడు. ఎవరూ రక్తంతో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే బ్లడ్-2 లివ్ సంస్థను స్థాపించి తన వంతుగా ప్రజలను చైతన్యం చేస్తూ... రక్తదానం చేయిస్తున్నానని చెబుతున్నాడు ఈ యువకుడు.
ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్