ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని రైతులు విక్రయిస్తే.. వారం రోజుల్లో వారి సొమ్ము రైతు ఖాతాల్లో జమ కావాలి. ఎలాంటి జాప్యం లేకుండా వారి ఖాతాకు నగదు పంపే బాధ్యత అధికారులది. పశ్చిమ గోదావరి జిల్లాలో రైతులు తమ ధాన్యాన్ని విక్రయించి.. రెండు నెలలు అవుతోంది. వందల కోట్ల రూపాయల ధాన్యం బకాయిలు రైతుకు అందాల్సి ఉంది. ఒక్కో రైతుకు లక్ష నుంచి పది లక్షల రూపాయల వరకు బకాయిలు జమ చేయాలి. రైతులు తమకు రావాల్సిన పైకం కోసం కాళ్లరిగేలా ధాన్యం కొనుగోలు కేంద్రాలు, బ్యాంకుల చుట్టు తిరుగుతున్నారు. డబ్బులు ఎప్పుడు ఇస్తారో అధికారులు సమాధానం చెప్పడం లేదు.
బకాయిలు రాక.. దిగాలు
జిల్లాలో ధాన్యం బకాయిలు 750 కోట్ల రూపాయలు పేరుకు పోయాయి. 5.5 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగుచేశారు. 375ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 7లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 1350 కోట్ల రూపాయలు రైతులకు నగదు చెల్లించాల్సి ఉండగా.. ఆరువందల కోట్ల రూపాయలు వారం రోజుల కిందట చెల్లించారు. సంక్రాంతి పండుగ సంబరంగా చేసుకొనే అన్నాదాతకు ధాన్యం బకాయిలు రాక.. దిగాలు పడుతున్నారు.
అనేక మంది కౌలు రైతులు
ధాన్యం పండించిన రైతును దళారులు, మిల్లర్లు, వ్యాపారులు దోచుకొంటున్నారన్న ఉద్దేశంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు రైతు ధాన్యం కొనుగోలుచేసి.. వారి సొమ్మును ఖాతాల్లో జమ చేయాలి. జిల్లాలో డ్వాక్రా, సహకార సంఘాలు ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో అధికమంది కౌలు రైతులు ఉన్నారు. సరైన సమయంలో నగదు జమ కాకపోవడం వల్ల.. తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రబీకి అదే పెట్టుబడి
జిల్లాలో ఖరీఫ్ కింద అధిక విస్తీర్ణంలో పంట సాగైంది. దాదాపు 14లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. తుపాన్ల వల్ల సగానికి పైగా దిగుబడి తగ్గింది. సీజన్ పూర్తవుతున్నా.. కేవలం ఏడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రం కొనుగోలు చేశారు. సగానికి పైగా దిగుబడులు పడిపోయినా అధికారులు సమయానికి ధాన్యం బకాయిలు చెల్లించడం లేదు. ఖరీఫ్ పంటసాగులో వచ్చిన ఆదాయాన్ని రైతులు రబీ పంటసాగుకు పెట్టుబడిగా వినియోగిస్తారు.
అదనంగా వడ్డీ
ప్రస్తుతం జిల్లాలో రబీ సాగు కింద వరిసాగును ముమ్మరంగా చేపట్టారు. చేతిలో సొమ్ములు లేక రబీ పంట సాగుకు పెట్టుబడి కోసం రైతులు అప్పులు చేస్తున్నారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారులతో రెండు రూపాయల చొప్పున అప్పు చేస్తున్నామని రైతులు అంటున్నారు. ఖరీఫ్ పంటసాగుకు చేసిన అప్పులు అలాగే ఉన్నాయి. ఒక్కో రైతుకు లక్ష నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ప్రైవేటు అప్పులు ఉన్నాయి. ధాన్యం బకాయిలు సకాలంలో రాకపోవడం వల్ల.. రైతులు అదనంగా వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. పలువురు రైతులు ఇప్పటికే అప్పుచేసి రబీ పంటసాగును చేపట్టారు.
ఖరీఫ్, రబీ పంటసాగుకు అప్పులు పెరిగి రైతుకు వడ్డీ భారంగా మారింది. పొలం దమ్ముచేయడానికి, ఎరువులు, కూలీల ఖర్చులు, వరిపంట కోత యంత్రాల అద్దెలు, ట్రాక్టర్ల అద్దెల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్పు దొరకని కౌలు రైతులు పంటసాగుకు సైతం దూరమవుతున్నారు. ఇప్పటికే 6 వందల కోట్ల రూపాయల సొమ్ము జమ చేశామని.. మిగిలిన సొమ్మును కొద్దిరోజుల్లో జమ చేస్తామని జిల్లా పౌరసరఫరాల మేనేజర్ రాజు అంటున్నారు. ఇప్పటికైనా.. ప్రభుత్వం స్పందించి తమ సొమ్ము ఖాతాల్లో జమ చేయాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: 'వ్యాక్సినేషన్ పూర్తయ్యాకే ఎన్నికలకు వెళ్తే మంచిది.. అలా కాదంటే కోర్టుకు వెళ్తాం'