కరోనాతో విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు నిట్, ఐఐటీలు బీటెక్ చివరి సంవత్సరం విద్యార్థులకు ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. లాక్డౌన్తో ఇళ్ల వద్దనున్న విద్యార్థులు అక్కడి నుంచే పరీక్షలు రాసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. పరీక్షల నిర్వహణలో జాప్యం జరిగితే ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు పొందినవారు.. ఉన్నత విద్యకు వెళ్లాల్సినవారికి ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో ఆన్లైన్ పరీక్షలకు ఐఐటీ తిరుపతి, తాడేపల్లిగూడెం నిట్ ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ను రూపొందించాయి.
నిట్లో 25% మార్కులకే..
తాడేపల్లిగూడెం నిట్లో చివరి సంవత్సరం విద్యార్థులకు జూన్ 1 నుంచి ఆన్లైన్ పరీక్షలు నిర్వహించనుంది. విద్యా సంస్థలో నిర్వహించిన మిడ్, మైనర్ పరీక్షలకు 75% వెయిటేజ్ ఇస్తారు. మిగతా 25% మార్కులకు మాత్రమే ఇప్పుడు పరీక్ష నిర్వహిస్తారు. బహుళైచ్ఛిక ప్రశ్నలు ఇస్తారు. ఇవి జంబ్లింగ్ విధానంలో ఉంటాయి. ప్రత్యేక సాఫ్ట్వేర్తో విద్యార్థి తన ల్యాప్టాప్, కంప్యూటర్, మొబైల్ఫోన్లో కెమెరా ఆన్ చేస్తేనే ప్రశ్నపత్రం డౌన్లోడ్ అవుతుంది. ఈ కెమెరా విద్యార్థిని పరిశీలిస్తూ ఉంటుందని అకడమిక్ డీన్ బీఆర్కే శాస్త్రి తెలిపారు. రెండు, మూడో సంవత్సరం విద్యార్థులకు మాత్రం ఆఫ్లైన్లోనే పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఐఐటీ తిరుపతిలో ప్రశ్నలు, జవాబుల రూపంలోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇవి జూన్ మొదటి వారంలో ప్రారంభం కానున్నాయి. కరోనా కారణంగా విద్యార్థులు ఒకచోటకు వచ్చి పరీక్షలు రాసే అవకాశం లేకపోవడంతో ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఐఐటీ తిరుపతి సంచాలకులు సత్యనారాయణ వెల్లడించారు.
చివరి ఏడాది సెమిస్టర్ పరీక్షలకు విద్యార్థులకు ఉత్తీర్ణత, అనుత్తీర్ణత అని మాత్రమే ఇస్తారు. గ్రేడ్లు ఇవ్వరు. విద్యార్థులు జవాబులను కంప్యూటర్పై టైప్ చేయాల్సి వస్తున్నందున సమయం కొంచెం ఎక్కువ ఇవ్వనున్నారు. విద్యార్థుల కదలికలను కంప్యూటర్లోని కెమెరా ద్వారా పరిశీలిస్తారు.
ఇదీ చదవండి: ప్రేమపేరుతో బాలికపై సామూహిక అత్యాచారం