ఇంటింటికీ రేషన్ సరఫరా విధానం విజయనగరంజిల్లాలో చక్కగా అమలవుతోందని రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ కోన శశిధర్ తెలిపారు. దీనిని మరింత సౌకర్యకరంగా మెరుగు పరచాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ శశిధర్ విజయనగరం జిల్లాలో డెంకాడ మండలం జొన్నాడ, విజయనగరంలోని లంకాపట్నం, బొగ్గులదిబ్బ ప్రాంతాల్లో ఎండీయుల ద్వారా జరుగుతున్న రేషన్ పంపిణీని పరిశీలించారు.
అధికారులకు ఆదేశాలు:
మొబైల్ డిస్పెన్సరీల ద్వారా రేషన్ పంపిణీలో వాలంటీర్లను భాగస్వాములుగా చేయాలని.. కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో కమిషనర్ శశిధర్ ఆదేశించారు. వాలంటీర్లకు దీని పట్ల అవగాహన పెంచాలని.. ఈ పాస్ వేసే పనిని వారికి అప్పగించాలన్నారు.
వీధి వీధికీ వాహనంలో సరకుల సరఫరా:
సరుకులు పంపిణీ చేసే రోజుకు ఒకటిరెండు రోజుల ముందుగానే ఆయా ప్రాంత ప్రజలకు సమాచారాన్ని ఇవ్వాలని సూచించారు. వాహనం వెళ్లేందుకు వీలైన ప్రతి వీధిలోకి వెళ్లి, సరకులను పంపిణీ చేయాలన్నారు. ఎట్టి పరిస్థితిలోనూ వాహనాల వద్ద జనం క్యూ లేకుండా, వాహనం దగ్గర ఇద్దరు లేదా ముగ్గురు కంటే ఎక్కువమంది ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రతీ ఇంటికీ తప్పనిసరిగా సంచుల ద్వారా సరుకులను అందజేయాలని సూచించారు.
మురికివాడ ప్రజలకు ముందుగా:
మురికివాడలు, కడు పేదలు నివశిస్తున్న ప్రాంతాల్లో ముందుగా సరుకుల పంపిణీ చేయాలన్నారు. రేషన్ డిపోల రేషనలైనేషన్ ప్రక్రియ ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని ఆదేశించారు. గిరిశిఖర గ్రామాలకు వీలైనంత దగ్గర ప్రాంతాలకు వాహనాలను తీసుకెళ్లి సరకులను పంపిణీ చేయాలన్నారు. ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకుండా, ఇంటిదగ్గరే రేషన్ సరుకులను అందుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యమని.. దానిని నెరవేర్చే విధంగా కార్యక్రమాన్ని అమలు చేయాలని సూచించారు.
మిల్లర్లకు హెచ్చరికలు:
జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియపై కమిషనర్ సమీక్షిస్తూ.. మిల్లింగ్ చేసి, బియ్యాన్ని తిరిగి ఇవ్వడంలో రైస్ మిల్లర్లు చేస్తున్న జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సార్టెక్స్ ఎందుకు ఇవ్వడంలేదని మిల్లర్లను ప్రశ్నించారు. రోజుకు 4వేల టన్నులు చొప్పున, ఈ నెలాఖరు నాటికి 1.28లక్షల టన్నుల సార్టెక్స్ బియ్యాన్ని అందించాలని.. మిల్లర్లకు ఇదే చివరి అవకాశమని కమిషనర్ హెచ్చరించారు.
ఇదీ చదవండి: రహదారుల విస్తరణ.. అడుగు ముందుకు పడని దుస్థితి..!