గతేడాది లాక్డౌన్, ప్రస్తుతం కర్ఫ్యూతో కూరగాయలు, పూల రైతులు నష్టాలు చవిచూస్తున్నారు. పండించిన పంటను సకాలంలో అమ్ముకోలేక, ఇతర ప్రాంతాలకు రవాణా చేసుకోలేక కుదేలవుతున్నారు. కరోనా విపత్తుతో జిల్లాలోనే పేరొందిన రామభద్రపురం కూరగాయల రైతులు, గరివిడి మండలం బొండపల్లి పూల రైతుల బతుకుచిత్రమే పూర్తిగా మారిపోయింది. గతంలో వ్యవసాయ క్షేత్రం వద్దకే ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వ్యాపారులు వచ్చి పంట కొనుగోలు చేసేవారు. దీంతో డిమాండుతో పాటు, మంచి ఆదాయం చేకూరేది. కాని ప్రస్తుతం అంతా మారిపోయింది. రెండేళ్లుగా కొనేవారు లేక, వదులుకోలేక వచ్చిన ధరకు అమ్ముకుంటున్నారు.
ఉత్తరాంధ్రలోనే అతిపెద్ద కూరగాయల మార్కెట్గా గుర్తింపు పొందినా రామభద్రపురంలో పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. మండలంలో సుమారు వెయ్యి ఎకరాల్లో కూరగాయల సాగవుతాయి. సుమారు 10 వేల టన్నుల పంట దిగుబడి వచ్చేది. స్థానిక అవసరాలకు పోనూ మిగిలిన ఆరు వేల టన్నులు ఇతర ప్రాంతాలకు రవాణా అయ్యేవి. ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాలకు నిత్యం లారీల్లో ఎగుమతి చేసేవారు.
విశాఖ, విజయనగరం, విజయవాడలో ప్రముఖ హోటళ్లకు ఇక్కడి నుంచే వెళ్లేవి. రూ.కోట్లలో వ్యాపారం సాగేది. దాంతో డిమాండు కారణంగా రైతుకు మంచి ఆదాయం వచ్చేది. అలాంటిది కొవిడ్ ఆంక్షల కారణంగా వాహనాలతో పాటు రవాణా నిలిచిపోయింది. మార్కెట్లో రోజుకు రూ.20 లక్షల వరకూ సాగిన టర్నోవర్ ప్రస్తుతం రూ.3 నుంచి రూ.4 లక్షలకే పరిమితమైంది. దాంతో రైతులు నష్టాలను చవి చూస్తున్నారు.
తరలించవచ్చు
పంటను ఇతర ప్రాంతాలకు పంట తరలించుకునే వెసులుబాటు ఉంది. కర్ఫ్యూ కారణంగా ఎగుమతిపై ఆంక్షలు లేవు. కొన్ని ఇబ్బందులు ఎదురవడం, వ్యాపారులు రాకపోవడం వాస్తవమే. అయినప్పటికీ మార్కెట్లో దళారుల దోపిడీని కట్టడి చేస్తున్నాం. రైతుబజార్లపై కూడా దృష్టి సారించాం. ధరల పట్టికలు ఏర్పాటు చేస్తున్నాం. ఆ మేరకు పంట అమ్ముకోవచ్చు. - శ్యామ్, ఏడీ, మార్కెటింగుశాఖ
ఇవీ కారణాలు...
* పలు రాష్ట్రాలకు నిలిచిన రవాణా * దూరప్రాంతాల నుంచి వ్యాపారులు రాకపోవడం * శుభకార్యాలు వాయిదా పడడం * హోటళ్లు, రెస్టారెంట్లు మూసివేయడం * ఇతర ప్రాంతాలకు తరలించే వెసులుబాటు లేదు * ఎక్కువమంది మాంసాహారాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం.
40 టన్నులు కొనేవాడిని...
రామభద్రపురం మార్కెట్ నుంచి రోజూ 40 టన్నులు సరకును కాకినాడ, రావులపాలెంకు తీసుకెళ్లి విక్రయించేవాడిని. అక్కడ దుకాణాలు, హోటళ్లు మూతపడడంతో ప్రస్తుతం మూడు టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తున్నాను. కర్ఫ్యూతో వ్యాపారాలు నిలిచిపోయి తీవ్రంగా నష్టపోయాను. -డి.అప్పలనారాయణ, వ్యాపారి, ఆనందపురం, విశాఖ జిల్లా
అడిగిన ధరకు ఇచ్చేస్తున్నాం..
కర్ఫ్యూతో నిర్ధేశిత సమయంలోనే అమ్ముకోవాలి లేకుంటే పంట వాడిపోతుంది. నిల్వ చేసుకునే మార్గం లేక అడిగిన ధరకు ఇస్తున్నాం. రెండేళ్లుగా ఇదే పరిస్థితి. గతంలో శుభ కార్యాలైతే క్షేత్రానికే వచ్చి కొనేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. - వర్రి సన్యాసరావు, కూరగాయల రైతు, రామభద్రపురం
అప్పులే మిగులుతున్నాయ్...
కూరగాయలు పండించే రైతులకు అప్పులే మిగులుతున్నాయి. ఏటా ఈ సీజన్లో శుభకార్యాలు ఉండడంతో మంచి గిరాకీ ఉండేది. అంతా తారుమారైంది. ఎకర విస్తీర్ణంలో వంకాయలు పండించగా పెట్టుబడి రూ. 35 వేలు కాగా, పంట రూ. 15 వేలకు వచ్చింది. రూ. 20 వేలు అప్పు మిగిలిందంటూ రైతు ఆవేదన వ్యక్తం చేెశారు.
బొండపల్లి సాగు చేసిన చామంతి తోట
జిల్లాలో గరివిడి, తెర్లాం, నెల్లిమర్ల, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, రామభద్రపురం, సీతానగరం మండలాల్లో వేలాది ఎకరాల్లో పూలతోటలను రైతులు సాగుచేస్తున్నారు. కనకాంబరాలు, మల్లెపూలు, లిల్లీ, సన్నజాజులు, చామంతి, గులాబీలు ఎక్కువగా పండిస్తున్నారు. వీటిని విశాఖపట్నం, విజయనగరం పట్టణాల్లో మార్కెట్లకు తరలించి ఆదాయం పొందేవారు. గరివిడి మండలంలో బొండపల్లి కనకాంబరాలు, చామంతి పూలతోటల సాగుకు ప్రసిద్ధి.
ఏటా ఫిబ్రవరి నుంచి మే వరకు శుభకార్యాలు ఎక్కువగా జరిగే కాలంలో పూలకు డిమాండు ఉండేది. ప్రస్తుతం లాక్డౌన్తో ఎగుమతులు నిలిచాయి. ఉదయం పూలు కోసి మార్కెట్కు తరలించేందుకు సమయం చాలక అవస్థలు పడుతున్నారు. ఒకరోజుకు మించి నిల్వ చేసే అవకాశం లేక పోవడంతో ఉష్ణోగ్రతలు పెరిగిన కారణంగా వాడి పోతున్నాయి. దీంతో చేసేది లేక వృథాగా పారబోస్తున్నారు. బొండపల్లికి చెందిన పూలరైతులు రాములు, తాతారావు, సింహాచలం మాట్లాడుతూ గతేడాది లాక్డౌన్లోనూ తీవ్రంగా నష్టపోగా మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితి పునరావృతమైందని వాపోయారు. పూల రైతుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు.
ఇవీ చూడండి: