విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా.. గుంటూరులో విద్యార్థి, యువజన సంఘాల నాయకులు ద్విచక్రవాహన ర్యాలీ చేపట్టారు. గుంటూరు నుంచి విశాఖ వరకు నాలుగు రోజుల పాటు ఈ ర్యాలీ కొనసాగనుంది. అమరావతి రోడ్డులోని అమృతరావు విగ్రహం వద్ద ఈ ర్యాలీని ఎమ్మెల్సీలు రామసుబ్రహ్మణ్యం, కత్తి నర్సింహారెడ్డి ప్రారంభించారు.
చాలా దేశాలు, మనదేశంలోనూ ఐదు రాష్ట్రాలు పోస్కోను తరిమికొట్టాయని... ఏపీలోకి రావడానికి ఎవరు అవకాశమిచ్చారని ఎమ్మెల్సీ రామసుబ్రమణ్యం ప్రశ్నించారు. ఆంధ్రప్రజలు అమాయకులా... అడిగేవారు లేరనా.. అంటూ ఆయన నిలదీశారు. అమృతరావు స్ఫూర్తితో విద్యార్థులు, యువజనులు, కార్మికులు, కర్షకులు, ఉపాధ్యాయులు.. అన్నివర్గాల ప్రజలు ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గళం విప్పాలని రామసుబ్రమణ్యం పిలుపునిచ్చారు.
కేంద్రప్రభుత్వం విభజన హామీలను గాలికొదిలేసిందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్లోనూ రాష్ట్రానికి మొండిచేయి ఎదురైందని ఆయన పేర్కొన్నారు. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ నిర్ణయంలోనూ రాష్ట్రానికి అన్యాయం జరిగే నిర్ణయాలు తీసుకున్నారని నర్సింహారెడ్డి ఆరోపించారు.
ఇదీ చదవండి: 'విశాఖ ఉక్కు కర్మాగారంపై తుక్కు అనే ముద్ర వేసి అమ్మాలని చూస్తున్నారు'