రాజధాని ప్రకటన తర్వాత ఊహించని విధంగా విశాఖలో భూముల విలువ పెరిగిపోయింది. ఈ క్రమంలో కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేసేస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. భవిష్యత్తులో వీఎంఆర్డీఏకు చెందిన భూముల ఆక్రమణకు గురికాకుండా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. విలువైన భూములన్నీ శివారు ప్రాంతాల్లో ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఇందుకోసం ఆధునిక సాంకేతిక పరిజానాన్ని వినియోగించనున్నారు. ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా మార్పులను సులభంగా గుర్తించేలా జీఐఎస్ (భౌగోళిక సమాచార విధానం)ను ఉపయోగించుకోనున్నారు. ఇప్పటికే వీఎంఆర్డీఏ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి సర్వే ప్రారంభించారు. కొన్నేళ్ల కిందట వీఎంఆర్డీఏకు ప్రభుత్వం పదివేలకుపైగా ఎకరాలు అప్పగించింది. వాటిల్లో చాలా వరకు వినియోగించుకోగా మూడు వేల ఎకరాలు ఖాళీగా ఉంది. వీటిలో ఎక్కువాగు మధురవాడ, శొంఠ్యాం, కాపులుప్పాడ, చిట్టివలస, కొమ్మాది, ఆనందపురం, గిడిజాల, యారాడ తదితర ప్రాంతాల్లో ఉన్నాయి.
ఏ మార్పు జరిగినా గుర్తించేలా!
వీఎంఆర్డీఏ పరిధిలోని భూములకు మొదట సర్వే నిర్వహించి జీపీఎస్ ట్రాకింగ్ తీసుకొని మండల సర్వేయర్ ఆమోదంతో వివరాలు వెబ్ల్యాండ్లో ఉంచనున్నారు. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో తమ భూమి ఎక్కడ ఎంతవరకు ఉందో సులభంగా గుర్తించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా భౌతికంగా గుర్తించేందుకు వీలుగా ప్రత్యేక హద్దు రాళ్లు ఏర్పాటు చేయించనున్నారు. మూడు అడుగుల కింద పైన నాలుగు అడుగులు కనిపించేలా వీటిని ఏర్పాటు చేయనున్నారు. వీటికి సంబంధించిన టెండర్లు ఇప్పటికే పిలిచారు.
వీఎంఆర్డీఏకు చెందిన భూముల సర్వే వివరాలు తీసుకొని జీఐఎస్ విధానంలో ఉపగ్రహ ఛాయాచిత్రాలతో ఎప్పటికపుడు మార్పులు తెలుసుకునేలా చేయనున్నారు. ఇందుకోసం జాతీయ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ సహకారంతో ఉపగ్రహ చిత్రాలు తీసుకొని ఈఎస్ఆర్ఐ (ఇన్విరాన్మెంటల్ సిస్టం రీసెర్చ్ ఇనిస్టిట్యూట్) సాఫ్ట్వేర్ సాయంతో మార్పులను కచ్చితంగా తెలుసుకోనున్నారు. దీంతో ఎక్కడైనా ఆక్రమణ జరిగినా, గుంతలు తీసినా, స్తంభాలు పాతినా స్పష్టంగా తెలిసిపోతుంది. ప్రతి పదిహేను రోజులకు ఈ మార్పులు కంప్యూటర్లో స్పష్టంగా తెలుస్తాయి. ఇప్పటికే సాఫ్ట్వేర్ కొనుగోలుకు సంబంధించిన సంప్రదింపులు పూర్తయ్యాయి. మొత్తం అందుబాటులో ఉన్న స్థలాలకు సర్వే పూర్తి చేసి జీఐఎస్ విధానంలో సంరక్షించనున్నారు.
వీఎంఆర్డీఏ పరిధిలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న భూమి (ఎకరాల్లో)
- వీఎంఆర్డీఏ పరిధిలోని మొత్తం భూమి : 10390.36
- ప్రస్తుతం వినియోగించకుండా ఖాళీగా ఉన్న భూమి : 3138.7
- కోర్టు వివాదాలు, ఆక్రమణల్లో ఉన్నట్లు గుర్తించినవి : 500
- లెఅవుట్లు అభివృద్ధికి వినియోగించింది : 1604.7
భూములకు డిజిటలైజేషన్
వీఎంఆర్డీఏకు శివారు ప్రాంతాల్లో విలువైన భూములున్నాయి. వీటి పరిరక్షణకు జీఐఎస్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని భవిష్యత్తులో సైతం ఆక్రమణలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇప్పటికే సంబంధిత సంస్థలతో సంప్రదింపులు జరిపాం. ఖాళీ భూముల సర్వే ఇప్పటికే ప్రారంభమైంది. ఇందులో ఎక్కడైనా ఆక్రమణలు గుర్తిస్తే వెంటనే తొలగించి స్వాధీనం చేసుకుంటాం. - కోటేశ్వరరావు, కమిషనర్, వీఎంఆర్డీఏ
ఇదీ చదవండి: ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టిన హైకోర్టు