మరోవైపు ఇసుక దొరకపోతే నిర్మాణ రంగంలో తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తోందని నిర్మాణరంగ పెట్టుబడిదారులు వాపోతున్నారు. నూతన ఇసుక విధానం వచ్చేలోపు పరిస్థితిని చక్కదిద్దాలని జిల్లా కలెక్టర్కు, అధికారులకు మెురపెట్టుకుంటున్నారు. కనీసం స్థానికంగా ఉన్న నది, వాగు లో ఉన్న ఇసుకను స్థానిక అవసరాలకు వాడుకునే వెసులు బాటు ఉండాలి అంటున్నారు.
అత్యవసర అవసరాల దృష్ట్యా కొందరు ఉభయగోదావరి జిల్లాల నుంచి ఇసుకను తెప్పించుకుంటున్నారు. లారీ ట్రిప్పుకు 40 వేల నుంచి 50 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. దీని వల్ల నిర్మాణ వ్యయం పెరుగుతోంది. ఇక వ్యక్తిగత గృహ నిర్మాణల సంఖ్య తగ్గిందని రాష్ట్ర క్రెడాయ్ నివేదికలు చెబుతున్నాయి. ప్రభుత్వం వెంటనే ఇసకు కష్టాలు నివారించే చర్యలు తీసుకుంటే మేలు జరుగుతుందని అంటున్నారు.
రాష్ట్రవ్యాప్తంగానూ ఇసుక కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ప్రభుత్వం నూతన ఇసుక విధానాన్ని ఎప్పుడు ప్రకటిస్తుందోనని నిర్మాణ రంగం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తోంది.