కరోనా వైరస్పై పోరు ప్రారంభించేనాటికి.. దేశంలో వనరుల కొరత ఉంది. శానిటైజర్ నుంచి మాస్క్ల వరకూ, మెడికల్ వార్డుల్లో బెడ్ల నుంచి టెస్టింగ్ కిట్ల వరకూ ప్రతిచోటా కొరత ఉండేది. దీన్ని అధిగమించేందుకు అంశాల్లో కొరత ఉండేది. అసలు వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందో కూడా తెలీదు. అదే సమయంలో కేంద్రం ప్రకటించిన లాక్డౌన్తో దేశం స్తంభించింది. రైళ్లు ఆగిపోయాయి. వ్యవసాయ ఉత్పత్తులను దేశనలుమూలలా చేర్చేందుకు నిరంతరాయంగా పనిచేసిన రైల్వేశాఖలో ఉద్యోగులనూ కొవిడ్ భయం వేధించేది. విశాఖలో ఉన్న ఆసియాలోనే అతిపెద్ద డీజిల్ లోకో షెడ్కు సారథ్యం వహిస్తున్న మెకానికల్ ఇంజనీర్ ఎస్ఎం పాత్రో.. ఆ పరిస్థితులను అధిగమించేందుకు సిద్ధమయ్యారు. అప్పటివరకూ ఉద్యోగులకు ఆదేశాలు, సూచనలు ఇస్తూ.. లోకో ఇంజన్లు సమర్థంగా పనిచేసేందుకు కృషి చేసిన ఆయన.. ఉద్యోగులూ అంతే సమర్థంగా, నిర్భయంగా పనిచేసేందుకు అవసరమైన వాతావరణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కష్టపడ్డారు. లోకోషెడ్లో వ్యర్థాలనే వైరస్ వ్యాప్తి నివారణ వ్యవస్థలుగా మార్చారు.
ప్రయాణీకులందర్నీ కాకపోయినా కనీసం రైల్వే సిబ్బందిని అయినా కరోనాకు దూరంగా ఉంచేందుకు.. దాదాపు 24 ఆవిష్కరణలను పాత్రో చేశారు. మొత్తం రైల్వేజోన్కు సరిపడేంత శానిటైజర్ను.. డబ్ల్యూహెచ్వో ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేశారు. అక్కడితో ఆగిపోకుండా మాస్క్లు డిజైన్ చేశారు. ఫుట్ డిస్పెన్షర్లు, కాలితో ఆపరేట్ చేస్తే నీళ్లు వచ్చేలా వాష్ బేసిన్ కుళాయిల్లో మార్పులు చేశారు. కరెన్సీ, దస్త్రాలు శానిటైజ్ చేసే బాక్సులతోపాటు... రూమ్, హాల్ శానిటైజేషన్ పరికరాలను రూపొదించారు. వీటన్నిటినీ తమ వద్ద వృథాగా పడిఉన్న వస్తువులతోనే తయారు చేశారు.
ఇన్ని పరికరాలను రూపొందించారంటే ఆఫీసులో పెద్దగా పనిలేదనుకుంటే పొరపాటే. నిత్యం షెడ్కు వచ్చే లోకోలను ఎప్పటికప్పుడు అందించటంలో ఇంజనీర్లు, సిబ్బందికి సూచనలిస్తూ.. మరోవైపు రైల్వేబోర్డు, కేంద్ర, జోనల్, డివిజనల్ కార్యాలయాల నుంచి వచ్చే జాబులకు.. ఎప్పటికప్పుడు జవాబు ఇవ్వాల్సిన బాధ్యతా ఆయన మీద ఉంటుంది. 307 డీజిల్ లోకోలు, 20 ఎలక్ట్రిక్ లోకోలకు షెడ్యూల్ ప్రకారం సర్వీసింగ్ చేసి.. ఏ సమస్య లేకుండా అవి వేలకిలోమీటర్లు పరిగెత్తించేలా సిబ్బందిని పరుగులు పెట్టించటంలో క్షణం తీరికలేకుండా ఉంటారు. ఇంత బిజీలోనూ ఇటీవల ఆయన మెడికల్ వార్డులో ఉపయోగించే రోబోను రూపొందించారు. ఇది తెలుసుకున్న రైల్వే మంత్రి పీయూష్ గోయెల్.. దీనిపై ట్వీట్ చేశారు. పాత్రోను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ రోబో విజయవంతంగా పని చేయటంతో.. తూర్పుకోస్తా రైల్వే ఆసుపత్రుల్లోని కొవిడ్ వార్డుల్లో ఉపయోగించేలా మరిన్ని రోబోల తయారీకి శ్రీకారం చుట్టామని పాత్రో తెలిపారు.
"కనిపించని శత్రవు కరోనా వైరస్తో పోరాడేందుకు.. డివిజనల్ రైల్వే ఆసుపత్రి కోసం ఒక రోబో తయారు చేశాం. ఇది శానిటైజర్ను తీసుకెళ్లే ఒక రిమోట్ కంట్రోల్ వాహనం. ఇందులో కెమెరా, స్పీకర్తోపాటు వైఫై కూడా ఉంది. రోగితో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది మాట్లాడేందుకు వీలుగా వైఫై వ్యవస్థను ఇందులో ఉంచాం. దీని వల్ల డెస్క్టాప్ లేదా మొబైల్ నుంచే వైద్యులు రోగి పరిస్థిని తెలుసుకోగలరు. ఆహారం, మందులు కూడా నేరుగా ఇది రోగికి అందిచగలదు. భువనేశ్వర్లోని కేంద్ర ఆసుపత్రి, కుర్దా, సంబల్పూర్లోని డివిజనల్ ఆసుపత్రుల కోసం మరో మూడు రోబోలు తయారుచేస్తున్నాం. "
-ఎస్ఎం పాత్రో, సీనియర్ డివిజనల్ మెకానికల్ ఇంజనీర్
భువనేశ్వర్, విశాఖ సహా పలు డివిజన్ల్ కార్యాలయాల్లో.. వ్యర్థాలతో ఆయన రూపొందించిన సుందర ఆకృతులు దర్శనమిస్తుంటాయి. వీటన్నికంటే కొవిడ్ సమయంలో తయారుచేసిన వస్తువులు మరింత సంతృప్తినిచ్చాయని పాత్రో చెప్పారు.
ఇదీ చదవండి:
రాజధాని బిల్లులు ఆమోదం పొందినట్లే.. హైకోర్టులో కౌంటర్ వేసిన శాసనసభ కార్యదర్శి