తూర్పుప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ పరిధిలో విశాఖ జిల్లాతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, ఉభయగోదావరి జిల్లాలున్నాయి. మొత్తం రావాల్సిన బకాయిలు రూ.2216.34 కోట్లని ఈపీడీసీఎల్ అధికారులు చెబుతున్నారు. ఇందులో కేవలం గ్రామ పంచాయతీ బకాయిలే రూ.1012.70 కోట్లు. అంటే.. దాదాపు సగం బకాయిలు ఇక్కడే ఆగిపోయాయి. వీటిని రాబట్టుకునేందుకు అధికారులు ఆయా జిల్లాల్లో నానాతంటాలు పడుతున్నారు. 5 జిల్లాల్లో మొత్తం 5106 పంచాయతీల్లో పెద్దఎత్తున బిల్లులు నిలిచిపోయినట్లుగా వారు వెల్లడిస్తున్నారు.
వరసగా నోటీసులు..
- గతేడాది పంచాయతీల నుంచి కేవలం రూ.44.28 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. 2019-20నాటికి రూ.869.96 కోట్ల బకాయిలుండగా, తాజాగా అది రూ.వేయి కోట్లు దాటింది.
- ఒక్క పంచాయతీలే కాక.. ఈపీడీసీఎల్కు ఇతర వైపులనుంచీ భారీగానే బిల్లులు నిలిచిపోయాయి. ప్రభుత్వ సబ్సిడీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ కార్యాలయాల నుంచి కూడా మరో రూ.1203.64 కోట్లు బకాయిలున్నట్లు అధికారులు చెబుతున్నారు.
- ఈ మొత్తం బకాయిల్ని ఎలాగైనా కట్టేలా చూడాలని ఈపీడీసీఎల్ అధికారులు ఏపీ విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)ని సంప్రదించారు. గత ఏడాదికాలంగా ఏపీఈఆర్సీ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ బకాయిలపై 3సార్లు నోటీసులు జారీచేశారు. గతేడాది నవంబరు 24న మూడో నోటీసు కూడా జారీచేశారు.
- బిల్లులు చెల్లించకపోతే ప్రభుత్వరంగ సంస్థలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కనెక్షన్లు తొలగిస్తామని అందులో తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ నడుస్తోందని, కొన్నిచోట్ల తొలగించే ప్రయత్నాలు చేస్తున్నామని ఈపీడీసీఎల్ చెబుతోంది.
కొద్దికొద్దిగా వసూళ్లు..:
ఈపీడీసీఎల్కు ఇప్పుడున్న బకాయిలకు మరింత అదనపు భారం పడేదే. కానీ గతేడాది వరసగా నోటీసులు జారీచేయడంతో కొంత వసూలైంది. రాష్ట్ర ప్రభుత్వం, ఇతర పురపాలికల నుంచి గత రెండేళ్లలో రూ.1431 కోట్లు విడుదల చేశారు. అయినప్పటికీ ఇంకా భారీగానే బకాయిలుండటం గమనించదగ్గ విషయం. ఈపీడీసీఎల్ తీరుపైనా, ఏపీఈఆర్సీ స్పందన తీరుపైనా కొన్ని విమర్శలొస్తున్నాయి. ప్రస్తుతం వీటిమీద సమీక్ష జరుగుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.
ఇదీ చదవండి: పంచాయతీ ఎన్నికలు... దొడ్డిదారిలో ఏకగ్రీవాలు!